kumaram bheem asifabad- పల్లె పోరుకు సమాయత్తం
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:12 PM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ముసాయిదా జాబితాలు ఆయా గ్రామ పంచాయ తీల్లో ప్రదర్శించారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగు కేంద్రాల పరిశీలన, తదితర ఏర్పాట్లు పూర్తి కాగా ప్రస్తుతం వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
- ముసాయిదా జాబితా విడుదల
- వార్డుకు ఒక్కోటి చొప్పున 2,874 పోలింగ్ కేంద్రాలు
- సెప్టెంబరు 1న అభ్యంతరాలు, 2న పరిష్కారం, తుది జాబితా
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ముసాయిదా జాబితాలు ఆయా గ్రామ పంచాయ తీల్లో ప్రదర్శించారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగు కేంద్రాల పరిశీలన, తదితర ఏర్పాట్లు పూర్తి కాగా ప్రస్తుతం వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, బీఎల్వోలు ఇంటి నంబర్ల ఆధారంగా వేర్వేరు చోట్ల ఉన్న కుటుంబ సభ్యులను ఒకే చోట, ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలతో అంతా సిద్దం చేశారు. గత 2024 ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీ కాలం ముగి యడంతో 335 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లాలోని 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీలు, 123 మంది ఎంపిటీసీ సభ్యుల పదవీ కాలం గత ఏడాది జూలై 4న ముగిసింది. ఆయా గ్రా మాల్లో కొంత కాలంగా అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపణల మధ్య గ్రామ పంచాయతీల ఎన్నికలకు సమాయత్తం అవుతుండడంతో ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు.
- 15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 335 గ్రామ పంచాయతీలలో 2874వార్డులకు గానూ 2874 పోలింగు కేంద్రాలుంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మొదటి విడతలో, రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాధనలు సిద్దం చేశారు. ఇప్పటికే ఆర్వోలకు పలు చోట్ల శిక్షణనిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఓటర్లు నమోదుతో జాబితా సిద్దం చేశారు. కొత్త గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలకు చెందిన ఓటర్లను కూడా జాబితాలో చేర్చారు.
- ఆయా గ్రామ పంచాయతీల్లో..
ముసాయిదా జాబితా వివరాల ప్రకారం ఆయా గ్రామ పంచాయతీలలో వచ్చే అభ్యంతరాలను సెప్టెంబరు 1 వరకు డీపీవో అభ్యంతరాలను స్వీకరించి 2న పరిష్కరిం చనున్నారు. అనంతరం తుది జాబితా విడుదల చేస్తారు. ముసాయిదా జాబితా ప్రకారం మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలు 664 మంది ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్లె పోరుకు జిల్లా అధికార యంత్రాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు కార్యాలయాలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటించారు. తుది జాబితా సిద్దం చేసి పంచాయతీ పోరుకు సిద్దమవుతున్నారు.
మండలాల వారీగా ఓటర్లు సంఖ్య
======================================================
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
======================================================
ఆసిఫాబాద్ 15,043 15,281 0 30,324
బెజ్జూరు 11,685 12,047 2 23.734
చింతలమానెపల్లి 12,118 11,837 0 23,955
దహెగాం 11,014 11,077 1 22,092
జైనూరు 11,935 12,427 0 24,363
కాగజ్నగర్ 22,857 22,383 2 45,242
కెరమెరి 12,145 11,800 1 24,026
కౌటాల 13,796 13,580 1 27,357
లింగాపూర్ 5,103 5,479 1 10,583
పెంచికల్పేట్ 6,218 6,064 0 12,302
రెబ్బెన 14,523 14,261 0 26,724
సిర్పూర్(టి) 11,016 11,163 3 22,182
సిర్పూర్ (యు) 5,835 6,440 2 12,277
తిర్యాణి 6,863 9,281 4 18,148
వాంకిడి 14,458 14,134 3 28,595
======================================================
మొత్తం 1,76,610 1,77,274 20 3,53,904
======================================================