kumaram bheem asifabad- కొత్తవారికి ‘రేషన్’..
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:21 PM
ఇటీవల కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు సెప్టెంబరు 1 నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన పేదలు సన్న బియ్యం అందుకోనున్నారు. గత నెలలో రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, జిల్లాలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అదికారులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను అడంబరంగా నిర్వహించారు
- సెప్టెంబరు 1 నుంచి అందించేందుకు సన్నాహాలు
- జిల్లాలో 14,919 నూతన కార్డులు మంజూరు
ఆసిఫాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఇటీవల కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు సెప్టెంబరు 1 నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన పేదలు సన్న బియ్యం అందుకోనున్నారు. గత నెలలో రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, జిల్లాలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అదికారులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను అడంబరంగా నిర్వహించారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రజలు బియ్యం కోసం ఇబ్బందులు పడోద్దనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకే సారి పంపిణీ చేశారు. ఈ కారణంగా కొత్త కార్డులు పొందిన వారికి సన్న బియ్యం పొందే అవకాశం దక్కలేదు. సెప్టెంబరు నుంచి వీరికి సైతం సన్న బియ్యం పంపిణీ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించడంతో కార్డులు పోందిన లబ్దిదారులు మొదటి సారి బియ్యం తీసుకొన్నారు. బియ్యంతో పాటు రేషన్ కార్డు ఆధారిత ప్రభుత్వ పథకాలను సైతం అర్హత సాధించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రస్తుతం జిల్లాలో..
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,56,823 రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి ప్రకారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహంచి కొత్త కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. జిల్లాలో కొత్తగా 14,919 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. గతంలో 1,14,904 రేషన్ కార్డులు ఉండగా 27,327 మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం పెరిగిన కార్డులకు అనుగుణంగా 30 వేలకు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం అందనంగా సరఫరా చేసేందుకు పౌర సరఫఱాల శాఖ అధికారులు సన్నద్దమవుతున్నారు. 1,56,823 రేష్ కార్డులకు సన్న బియ్యం అందించనున్నారు. అలాగే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించి ప్రత్యేక బ్యాగును లబ్ధిదారులకు అందించనున్నారు. సంచిపై ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలు ముద్రించారు. కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయక పోవడంతో వేలాది పేదలు బియ్యంతో పాటు ఆదప సమయంలో ఆరోగ్య శ్రీ ద్వారా పొందే వైద్య సేవలకు సైతం దూరమయ్యారు నూతన కార్డుల పంపిణీలో సమస్యలకు పరిష్కారం లభించింది.
జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లు
జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లు ఆసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్నగర్, సిర్పూర్(టి), జైనూరులో ఉన్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం కోటాను కొత్త కార్డుల ఆధారంగా కేటాయించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 314 రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. అయితే పేదలకు సన్న బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసర సరుకులు రాయితీతో అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నిత్యావసర సరుకులు అందించాలి..
- చిరంజీవి, సీపీఐ జిల్లా నాయకడు
గతంలో మాదిరిగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు పప్పు, నూనె, చక్కర, ఉప్పు, కారం వంటి నిత్యావసర సరుకులు అందించాలి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెరగడంతో నిరుపేద ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది.