TG Govt: తదుపరి లక్ష్యం రాజీవ్ యువ వికాసం
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:43 AM
వానాకాలం సీజన్ రైతుభరోసా నగదు బదిలీని విజయవంతంగా పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎంచుకుంది.
రైతుభరోసా పూర్తితో కొత్త పథకంపై సర్కారు దృష్టి
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్ రైతుభరోసా నగదు బదిలీని విజయవంతంగా పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ఎంచుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం స్పష్టత ఇచ్చారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. ‘‘రైతుభరోసా పూర్తికాగానే భట్టి విక్రమార్క ఇక విరామం తీసుకుందామని అనుకుంటున్నారు. కానీ, ఆయనకు విరామం లేదు. రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో మా ముందున్న సవాలు రాజీవ్ యువ వికాసం! ప్రణాళికలు రూపొందించుకొని ప్రజల ముందుకు వస్తాం! యువతకు న్యాయం చేస్తాం! మీ ఆశీర్వాదం తీసుకుంటాం!’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 5 లక్షల మంది అర్హులను గుర్తించి.. ఆర్థిక సాయం అందించాలని, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.