Rahul Gandhi and Priyanka Gandhi : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకం
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:44 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
దేశానికే మార్గం చూపిన తెలంగాణ
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చాం
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. దేశవ్యాప్తంగా కుల గణనకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం చూపిందని అన్నారు. కుల గణన దేశానికి అవసరమని, దాన్ని తాము చేసి చూపుతామని వెల్లడించారు. తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కుల గణనలో ఓబీసీల లెక్కపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఇక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన మరో హామీని నెరవేర్చిందని ప్రియాంక గాంధీ అన్నారు. బిల్లు ఆమోదం పొందడం సామాజిక న్యాయం అమలులో కీలకమైన అడుగని హర్షం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధావి అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ప్రశంసించారు.