kumaram bheem asifabad-విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:46 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషక విలువలతో కూడిన రుచికరమైన అహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, భోజనం నాణ్యత, తరగతి గదులను పరిశీలించారు
ఆసిఫాబాద్ రూరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషక విలువలతో కూడిన రుచికరమైన అహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, భోజనం నాణ్యత, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మెనూ ప్రకారం సకాలంలో అందించాలని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా ప్రత్యేక దృష్టి సారించి వారి తల్లితండ్రులతో ఉపాధ్యాయులు మాటాడాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట విద్యాశాఖాధికారి ఉదయ్బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాల సాధనకు పాటుపడాలి
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి పురస్కరించుకుని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్ డేవిడ్, గౌడ సంఘం నాయకులు, వెనకబడిన తరగతుల సంఘాల నాయకులతో కలిసి హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ బహుజన రాజ్యాధికార పోరాట యోథుడు, మొగలాయిల ఆగడాలను ఎదురించిన మహాయోథుడు సర్దార్ సర్వాయి పాన్నగౌడ్ అని అన్నారు. సౌకర్యాలు లేని రోజుల్లో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజనుల కోసం పోరాటాలు చేశారని తెలిపారు. ఇలాంటి మహానీయుల ఆశయ సాధనకు మనమందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి సమష్టిగా కృషి చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి జీవన్, పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, నాయకులు శ్యాంనాయక్, గౌడ సంఘం నాయకులు సుదర్శణ్గౌడ్, రమేశ్, ప్రణయ్ పాల్గొన్నారు.