పోలీస్బాస్.. త్వరలో డీసీపీ నుంచి ఎస్పీ
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:40 AM
రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకం గా ప్రతిపాదించిన రెండు ప్రణాళికలు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీ్సశాఖ పై ప్రభావం చూపనున్నాయి.
భువనగిరి జోన్ త్వరలోనే యాదాద్రి భువనగిరి పోలీస్ జిల్లాగా
రాచకొండ కమిషనరేట్ పునర్విభజనకు ప్రభుత్వ నిర్ణయం.
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్): రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకం గా ప్రతిపాదించిన రెండు ప్రణాళికలు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీ్సశాఖ పై ప్రభావం చూపనున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్నాళ్లు డీసీపీ పరిధిలో పనిచేసిన పోలీసులు ఎస్పీ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు రాచకొం డ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరిజోన్ త్వరలోనే పోలీ్సశాఖలో కూడా జిల్లాగా మారనుంది. ఇక్కడ ఎస్పీని నియమించనున్నట్లు సమాచారం. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలీస్ అధికారులు ప్రైవేట్ సంభాషణల్లోనూ నిర్ధారిస్తున్నారు. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం జిల్లా పోలీస్లకు ఎస్పీ బాస్గా రానున్నారు.
రాచకొండ కమిషనరేట్ నుంచి విభజన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట 2016, అక్టోబరు 11న జిల్లా పునర్విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాను రెవన్యూ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ పరిపాలనాధికారిగా వ్యవహరిస్తుండగా పోలీ్సశాఖను మాత్రం భువనగిరి జోన్గా రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి చేర్చారు. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగానికి రాచకొండ కమిషనర్ బాస్గా వ్యవహరిస్తున్నారు. జిల్లా పోలీ్సశాఖలో ప్రతీ నిర్ణయం కమిషనరేట్ తీసుకోవాల్సిన పరిస్థితి. రాచకొండ కమిషనరేట్లోని మిగ తా మూడు జోన్లు ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ నగర వాతావరణంలో ఉండగా భువనగిరి జోన్ మాత్రం గ్రామీణ నేపథ్యంతో ఉంది. దీంతో కమిషనరేట్ నిర్ణయాలు, పాలన భువనగిరి జోన్కు కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అం తేగాక న్యాయంకోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందు లు పడ్డారు. అంతేగాక చట్టసభల ప్రతినిధులు కూడా రాచకొండ కమిషనర్ను కలిసేందుకు ఇబ్బందులను పడుతున్నట్లు పలుమార్లు స్వయంగా పేర్కొన్న సందర్భాలూ లేకపోలేదు. దీంతో అప్పట్లోనే భువనగిరిజోన్ను జిల్లా పోలీ్సగా గుర్తించి ఎస్పీని నియమించాలని బహిరంగంగా, అంతర్గతంగా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ పునర్విభజన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మూడు కమిషనరేట్ల పునర్విభజన నిర్ణయంతో రాచకొండ కమిషనరేట్ నుంచి భువనగిరిజోన్ను విభజించి యాదాద్రి భువనగిరి జిల్లాగా పేర్కొంటూ ఎస్పీని నియమించనున్నట్లు తెలుస్తోంది.
పలుమార్పులు
రాచకొండ కమిషనరేట్ విభజనతో జిల్లా పోలీ్సపాలనలో పలు మార్పులు రానున్నాయి. డీసీపీ స్థానంలో ఎస్పీ, డిప్యూటీ డీసీపీ స్థానంలో అదనపు ఎస్పీ, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఏసీపీల స్థానంలో డీఎస్పీలు వస్తారు. సర్కిళ్లు, పోలీస్టేషన్లు, జిల్లా మహిళా పోలీస్టేషన్ యథావిధిగా కొనసాగుతాయి. ట్రాఫిక్ పోలీసులు, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్వహణలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అధికారుల, సిబ్బంది, హోంగార్డు బదిలీలు, విధుల ప్రక్రియలో కూడా మార్పులు జరగనున్నాయి. జిల్లా పోలీసుశాఖలో ప్రతీ నిర్ణయం ఎస్పీ కంట్రోల్లో ఉండనుంది. అయితే ఇప్పటివరకు కమిషనర్కు ఉన్న మెజిస్టీరియల్ పవర్ ఎస్పీకి ఉండదు. శాంతి భద్రతల పరిరక్షణ, కర్ఫ్యూ విధింపు తదితర కొన్ని నిర్ణయాలను కలెక్టర్ అనుమతితోనే ఎస్పీ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుత భువనగిరి జోన్ పోలీసు ఇలా..
ప్రస్తుత భువనగిరి జోన్లో ఒక డీసీపీ, ఒక అదనపు డీసీపీ, ముగ్గురు ఏసీపీలు ఉన్నారు. 19 పోలీస్టేషన్లు, ఒక జిల్లా మహిళా పోలీస్టేషన్, నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదు గురు డీసీపీలుగా విధులు నిర్వహించారు. వరుసగా పి.యాదగిరి, రాంచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, రాజేష్ చంద్ర, ప్రస్తుతం అక్షాంశ్ యాదవ్ కొనసాగుతున్నారు.