Phone tapping case: మీరెందుకు జోక్యం చేసుకున్నారు?
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:09 AM
ఫోన్ట్యాపింగ్ కేసులో శ్రవణ్రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు సహకరించకపోవడంతో, తదుపరి విచారణలో మౌనంగా ఉండినట్లు సమాచారం.
ఎవరు మీకు ఫోన్నంబర్లు ఇచ్చేవారు!?
మీకు.. బీఆర్ఎస్ నేతలకు సంబంధమేంటి!!
4 గంటల పాటు శ్రవణ్రావు విచారణ
విచారణకు సహకరించని శ్రవణ్రావు!
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫోన్ట్యాపింగ్ అనేది పూర్తిగా ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ స్థాయి వ్యవహారమైనప్పుడు మీరెందుకు జోక్యం చేసుకున్నారు? అసలు ఎస్ఐబీ అధికారులతో మీకు ఎంతకాలం నుంచి పరిచయం ఉంది? మీకు.. బీఆర్ఎస్ నేతలకు సంబంధమేంటి? ట్యాపింగ్ కోసం ఫోన్ నంబర్లను మీకు ఎవరు అందజేసేవారు?’’ అంటూ ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకు ముందు మూడుసార్లు విచారణకు హాజరైన శ్రవణ్రావు.. సిట్కు సహకరించకపోవడంతో.. పోలీసులు అతని నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల నుంచి డాటాను వెలికి తీశారు. దాంతోపాటు.. పలు సాంకేతిక ఆధారాలతో బుధవారం 4 గంటల పాటు విచారణ జరిపారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో పరిచయం గురించి ప్రశ్నించగా.. శ్రవణ్రావు మూగనోము పట్టినట్లు తెలిసింది.
దాంతో.. రిట్రీవ్ చేసిన డాటాను ఆయన ముందుంచి, ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఫోన్కాల్స్, ఇద్దరూ కలిసినప్పుడు సెల్టవర్ లొకేషన్ డాటా.. ఇలా సాంకేతిక ఆధారాలను ముందు పెట్టడంతో శ్రవణ్రావు పలు ప్రశ్నలకు ముభావంగా సమాధానమిచ్చి, కీలక ప్రశ్నల విషయంలో మౌనం వహించినట్లు తెలుస్తోంది. ‘‘అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల్లో ఎవరు ఫోన్ నంబర్లను ఇచ్చేవారు? ట్యాపింగ్ ద్వారా మీరు సమాచారాన్ని చేరవేసి, ఎంతమేర ఆర్థిక లబ్ధి పొందేవారు? మీకు.. బీఆర్ఎస్ నాయకత్వానికి సంబంధమేంటి? ఈ కేసులో అరెస్టయిన మాజీ పోలీసు అధికారులతో ఎన్నిసార్లు కలిశారు?’’ అని అడిగిన ప్రశ్నలకు శ్రవణ్రావు సరైన సమాధానాలివ్వలేదని తెలిసింది. దీంతో.. సిట్ అధికారులు మరోసారి శ్రవణ్రావును విచారణకు పిలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రవణ్రావు విచారణకు పూర్తిస్థాయిలో సహకరించకపోవడాన్ని కారణంగా చూపెడుతూ.. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సమయంలో పిటిషన్ దాఖలు చేసి.. ఆయనకు మధ్యంతర రక్షణను తొలగించాలని సిట్ అధికారులు కోరనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...