ESI hospitals: ఈఎస్ఐ ఆస్పత్రులకు సుస్తీ!
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:24 AM
రాష్ట్రంలోని ఈఎ్సఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులకు సుస్తీ చేసింది. రోగులకు సరిగా వైద్యం అందని దుస్థితి ఏర్పడింది....
వైద్యసేవలు సరిగా అందక రోగుల అవస్థలు.. కిట్లు లేక వైద్య పరీక్షలు బంద్
అత్యవసర ఔషధాలకూ దిక్కులేని స్థితి
కీలక విభాగాలన్నీ ఒకరిద్దరి చేతుల్లోనే..
పదోన్నతుల్లో వైద్యులు, సిబ్బందికి అన్యాయం
మంత్రికి ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఈఎ్సఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులకు సుస్తీ చేసింది. రోగులకు సరిగా వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. కిట్లు లేక వైద్య పరీక్షలు సరిగా చేయడం లేదు. అవసరమైన మందులూ అందుబాటులో లేవు. దీనితో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని ఈఎ్సఐ చందాదారులు వాపోతున్నారు. ఈఎస్ ఆస్పత్రుల దుస్థితికి ప్రధాన కారణం ఈఎస్ ఐ డైరెక్టరేట్ అస్తవ్యస్తంగా మారడమేనన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డైరెక్టరేట్లో కీలక విభాగాలన్నీ ఒకరిద్దరి చేతుల్లో ఉన్నాయని.. ఉన్నతాధికారులు అం టీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యలకుతోడు తమకు పదోన్నతుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈఎ్సఐ వైద్యులు, సిబ్బంది ఇటీవల కార్మిక మంత్రి గడ్డం వివేక్కు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం వ్యవహారంపై మంత్రి విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో ఈఎ్సఐ కింద సుమారు 18 లక్షల మంది చందాదారులు న్నారు. ప్రతినెలా కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నారు. కానీ ఈఎ్సఐ ఆస్పత్రుల్లో సరిగా వైద్యసేవలు అందడం లేదు. ఈఎ్సఐ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఏటా ఔషధాలు, ఇతర వైద్య సామగ్రి కొనుగోలు, కొత్త ఈఎ్సఐ డిస్పెన్సరీలు, ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలతో వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలి. కానీ డైరెక్టరేట్ అధికారులు ఈసారి ఇంకా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయలేదు. మార్చి నాటికి టెస్టింగ్కిట్ల సరఫరా టెండర్ ముగిసింది. కానీ ఔషధాలు, వైద్య సామగ్రి కొనుగోలు విషయంలో కొందరు అధికారులు సరఫరాదారులతో కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో సకాలంలో టెండర్లు పూర్తిగాక.. మందులు, వైద్య పరికరాల కొరత ఏర్పడింది. పెయిన్కిల్లర్స్, విటమిన్లు, ఇన్సులిన్, టీటీ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. ల్యాబ్ కిట్లు, ఎక్స్రే ఫిల్ములు లేక రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు ఈఎ్సఐ ఆస్పత్రుల్లో వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు 50శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. వైద్యసేవలు సరిగా అందకపోవడంతో ఈ ఎ్సఐ ఆస్పత్రులకొచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోంది.
కీలక విభాగాలన్నీ ఒకరిద్దరి చేతుల్లోనే!
ఈఎ్సఐ డైరెక్టరేట్లో కీలక విభాగాలన్నీ ఇద్దరి చేతుల్లోనే ఉండటం సమస్యగా మారిందని వైద్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. సుమారు 12 విభాగాలు ఉండగా.. అందులో ఐదు విభాగాలను పాలన విభాగంలో పనిజేసే ఓ ఉద్యోగికి అప్పగించారని చెబుతున్నాయి. గతంలో తీవ్ర ఆరోపణల అప్రాధాన్య పోస్టుకు బదిలీ అయినా ఆ ఉద్యోగి.. ఇటీవలే ప్రాధాన్య పోస్టులోకి వచ్చారని అంటున్నాయి. అప్పటి నుంచి ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై మంత్రికి ఫిర్యాదులు వెళ్లాయని వెల్లడిస్తున్నాయి.

టెస్టులు, మందులు లేవంటున్నారు
మాకు ఈఎ్సఐ కార్డు ఉంది. ప్రతీనెలా చందా కట్ అవుతోంది. ఆరోగ్యం బాగోలేక ఈఎ్సఐ చిక్కడపల్లి డిస్పెన్సరీకి వస్తే ఇక్కడ కాదు నాచారం ఆస్పత్రికి వెళ్లాలన్నారు. అక్కడికి వెళితే టెస్టులు లేవు, మందులు లేవని మళ్లీ ఇక్కడికి పంపారు. వైద్యం కోసం ఇబ్బందిపడుతున్నాం. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు.
- ఉమ, హైదరాబాద్

టెస్టులు, ఎక్స్రే కూడా లేవంటున్నారు
ఆరోగ్యం బాగోలేక నాచారం ఈఎ్సఐ ఆస్పత్రికి వస్తే టెస్టులు లేవని బయట చేయించుకోవాలని చెబుతున్నారు. రోగులకు సరిగా చికిత్స అందడం లేదు. వైద్య సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మా జీతాల్లో ఈఎ్సఐ కట్ అవుతోంది. వైద్యం అందడం లేదు. ప్రైవేటుకు వెళితే ఆర్థికంగా గుల్ల అవుతాం.
- సునీల్, నాచారం, హైదరాబాద్