Patient Receives Pacemaker Free Under Aarogyasri: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రోగి గుండెకు పేస్మేకర్
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:57 AM
ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. గుండె నెమ్మదించి ప్రాణాపాయ స్థితిలో...
పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అరుదైన ఘనత
ఖమ్మం కలెక్టరేట్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. గుండె నెమ్మదించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ కింద అతడి గుండెకు పేస్మేకర్ అమర్చారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడేనికి చెందిన వెంకన్న గత నెల 24న అపస్మారక స్థితిలో ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చాడు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ సీతారాం పరీక్షలు నిర్వహించి.. సాధారణంగా నిమిషానికి 72సార్లు కొట్టుకోవాల్సిన గెండె 22సార్లు మాత్రమే కొట్టుకుంటోందని గుర్తించారు. విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మానవతా దృక్పథంతో ఆరోగ్యశ్రీలో పేస్మేకర్ను రూ3.50 లక్షల ఖర్చుతో హైదరాబాద్ నుంచి తెప్పించారు. నవంబరు 28న డాక్టర్ సీతారాం నాయక్ బృందం 4 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి వెంకన్న గుండెకు పేస్మేకర్ అమర్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో మాత్రమే చేసే ఈ అరుదైన ఆపరేషన్ ఇక్కడ నిర్వహించడంతో సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్, ఆర్ఎంవో డాక్టర్ రాంబాబు.. డాక్టర్ సీతారాం నాయక్ను అభినందించారు. వెంకన్న పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం అతడిని ఇంటికి పంపించారు.