పాఠశాలలోనే ‘పంచాయతీ’
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:36 AM
మండలంలోని పోతినేనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం ‘హామీ’గానే మిగిలిం ది.
పాఠశాలలోనే ‘పంచాయతీ’
పోతినేనిపల్లిలో ఒకే ప్రాంగణంలో నిర్వహణ
జీపీ పక్కా భవనానికి ఎమ్మెల్యే హామీ
సిద్ధం కాని స్థలం
నూతన భవనం ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్
నార్కట్పల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతినేనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం ‘హామీ’గానే మిగిలిం ది. గ్రామపంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో ఇటు ‘పాఠశాల’ను....అటు ‘పంచాయతీ’ని ప్రస్తుతం ఒకే ప్రాంగణంలోని భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు అంగనవాడీ కేంద్రం నిర్వహించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన చిన్న గదిలోనే నేటికీ గ్రామ పంచాయ తీ కార్యాలయాన్ని అసౌకర్యాల మధ్య కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీకి పాలకవర్గం లేకపోవడంతో పాఠశాలకు ఇప్పటికిప్పు డే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ కొన్ని రోజులకైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి పాలకవర్గం ఏర్పాటైతే తరుచూ సమావేశాలు, వివిధ పనులపై సర్పంచ లేదా వార్డుసభ్యులను కలవడానికి వచ్చే గ్రామస్థులు, గ్రామ సభల నిర్వహణ సమయాల్లో పాఠశాలలో తరగతుల నిర్వహణకు అసౌకర్యం ఏర్పడనుంది.
ఎమ్మెల్యే హామీ ఇచ్చినా....
గతేడాది పోతినేనిపల్లెలో తన సొంత ఖర్చు తో పాఠశాల పక్కనే ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రం ప్రారంభానికి ఎమ్మెల్యే వీరేశం వచ్చిన సమయంలో ఒకే భవనంలో ఇటు పాఠశాలను అటు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించడం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిస్థితిని స్వయంగా చూసిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాని కి పక్కా భవనం మంజూరు చేయిస్తానని హా మీ ఇచ్చారు. పాఠశాల పక్కనే అందరికీ అనుకూలంగా ఉన్న గ్రామ కంఠం భూమిలో దాదాపు 25 సంవత్సరాల క్రితం నెదర్లాండ్ పథకం కింద ఏర్పాటు చేసిన డీ ఫ్లోరినేషన ప్లాంట్ను తొలగించి ఆ స్థలంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని కూడా సూచిస్తూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. కానీ నేటికీ ఆ డీ ఫ్లోరినేషన ప్లాంట్ను తొలగించలేదు. పైగా గ్రామ పంచాయతీకి పక్కా భవనం ఊసే మరిచారు. అయితే ఆ స్థలంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పోగా మిగతా ఖాళీ స్థలంలో నర్సరీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 3వ తేదీన నార్కట్పల్లిలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొత్త జీపీ భవనాల చర్చ లో పోతినేనిపల్లి కూడా రావడం గమనార్హం.
ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే...
మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న డీ ఫ్లోరినేషన ప్లాంట్ను కూడా తొలగించే బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. ప్లాంట్ స్థలంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయ భవనం నిర్మించాలని అప్పటి స ర్పంచ శంకరయ్య సంకల్పించి అప్పటి ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్లోని ఇనుము, పరికరాలు, యంత్రాల విలువను అంచనా వే సి టెండర్ నిర్వహించి ప్లాంట్ను తొలగించా రు. ప్రస్తుతం ఆ స్థలంలో పల్లె దవాఖానాను నిర్మించారు. కానీ పోతినేనిపల్లెలో మాత్రం అధికారుల అస్పష్టత కారణంగా గ్రా మస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే డీ ఫ్లోరినేషన ప్లాంట్ను తొలగించి నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
ప్లాంట్ ఏ శాఖ పరిధిపై స్పష్టత లేదు
పోతినేనిపల్లి గ్రామ పం చాయతీకి పక్కా భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని ఓ చిన్న గదిలో కొనసాగిస్తున్నాం. కొత్త జీపీ భవనానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కా నీ కొత్త జీపీ కట్టేందుకు ఎంచుకున్న స్థలంలోని డీ ఫ్లోరినేషన ప్లాంట్ తొలగించాల్సిన బాధ్యత ఎవరిదో మాకు తెలియదు. వాస్తవానికి ఆ ప్లాంట్ ఏ డిపార్ట్మెంట్ పరిధిలో మాకు స్పష్టత లేదు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి, జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టతకు వస్తాం. తదుపరి ఎమ్మెల్యే సూచన, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
కే.ఉమేష్చారి, ఎంపీడీవో, నార్కట్పల్లి