Chenagoni Katamraju: చనిపోయాడనే సానుభూతితో...
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:05 AM
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందగా, ఎస్సీ కాలనీవాసులు సహృదయతతో వ్యవహరించారు....
మునుగోడురూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందగా, ఎస్సీ కాలనీవాసులు సహృదయతతో వ్యవహరించారు. ఆ అభ్యర్థి పంపిణీచేసిన నగదును అందరినుంచి వసూలుచేసి ఇంట్లోవారికి అందజేశారు. గ్రామానికి చెందిన చెనగోని కాటంరాజు (49) బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా సుమారు రూ.25లక్షలు ఆయన ఖర్చు చేసినట్లు తెలిసింది. 11న జరిగిన ఎన్నికల్లో కాటంరాజు 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదట్నుంచీ కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్న ఆయన ఈ ఓటమిని తట్టుకోలేకపోయారు. 14న కాటంరాజు గ్రామస్థులతో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వెంటనే.. గ్రామంలోని 9, 10వ వార్డుల్లోని ఎస్సీ కాలనీ ఓటర్లు తమకు ఇచ్చిన నగదును ఆయన కుమారుడు వంశీకి అందజేశారు.