Telangana Govt: ఆఫీస్ ఆటోమేషన్ పరీక్ష పాసవ్వాల్సిందే
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:03 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంప్యూటర్ల వినియోగంలో అవసరమైన ‘ఆఫీస్ ఆటోమేషన్’ నైపుణ్య పరీక్షలో ఇక తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందే....
కంప్యూటర్ల వాడకంలో ఈ నైపుణ్య పరీక్ష అవసరం
సచివాలయ, హెచ్వోడీల సిబ్బందికి సర్కారు కొత్త నిబంధన
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంప్యూటర్ల వినియోగంలో అవసరమైన ‘ఆఫీస్ ఆటోమేషన్’ నైపుణ్య పరీక్షలో ఇక తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందే. సచివాలయంలోని సిబ్బంది, సచివాలయం వెలుపల ఉండే విభాగాధిపతుల (హెచ్వోడీ) కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధన విధించింది. వీరంతా ఆఫీస్ ఆటోమేషన్ నైపుణ్య పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. 2014 మే 12 తర్వాత నియమితులైన ఉద్యోగులు ఈ శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సచివాలయ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1997, ది తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్-1998లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేశారు. సచివాలయంలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు, హెచ్వోడీల్లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ, ఎల్డీ టైపిస్టులకు ఈ పరీక్షను తప్పనిసరి చేసింది. ప్రొబేషనరీ కాలంలో ఈ పరీక్షలో పాస్ కాని వారు మాత్రమే మళ్లీ ఈ ఆఫీస్ ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.