Share News

EB 5 Green Card Trap: ప్రవాసులకు ఈబీ 5 గాలం!

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:35 AM

అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకోవడం చాలా మందికి కల. ఆ కల నెరవేర్చుకోవడానికి దశాబ్దాల తరబడి ఎదురుచూస్తుంటారు. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లి..

EB 5 Green Card Trap: ప్రవాసులకు ఈబీ 5 గాలం!

  • కాగితం మీద కనిపించే ప్రాజెక్టులే ఎక్కువ!.. అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం భారీగా పెట్టుబడులు

  • సులభమైన వర్క్‌ పర్మిట్లకు ఆకర్షితులై సొమ్ములు పెట్టేస్తున్నారు

  • తేలిగ్గా మూలధనం సమకూర్చుకుంటున్న బడాబాబులు

  • రూ.7 కోట్ల పెట్టుబడికి మూడేళ్లలో వచ్చేది రూ.21 లక్షలే

  • వర్క్‌ పర్మిట్‌ రద్దయి, డబ్బు పోగొట్టుకుంటున్నవారెందరో..!

  • తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ధనవంతుల కుటుంబాలకు స్వర్గధామంగా ఈబీ-5

  • కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

  • (డల్లాస్‌ నుంచి కిలారు గోకుల్‌ కృష్ణ)

అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకోవడం చాలా మందికి కల. ఆ కల నెరవేర్చుకోవడానికి దశాబ్దాల తరబడి ఎదురుచూస్తుంటారు. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లి.. వలసదారులుగా ఉంటూ శాశ్వత నివాసం కోసం నిరీక్షిస్తుంటారు. ఇలా ఏళ్ల తరబడి ఎదురు చూడడం కంటే సంపాదించిన సొమ్మును అమెరికాలో మంచి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి, ‘ఎంప్లాయిమెంట్‌ బేస్డ్‌ (ఈబీ)-5’ ప్రోగ్రాం ద్వారా గ్రీన్‌కార్డును త్వరగా పొందాలని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారి ఆశలను ఆసరాగా తీసుకుని ఇటీవలి కాలంలో ఈబీ-5ను సైతం కొందరు ప్రవాసులు (ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవారు) తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అమెరికాలోని ప్రధాన నగరాల్లో తెలుగువారి ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ‘కాగితం మీద మాత్రమే కనిపించే’ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి, సాటి ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ బడాబాబులకు సమర్పించేసుకుంటున్నారు. ఈబీ-5 ప్రోగ్రాం దరఖాస్తుదారులు వేలల్లో ఉండగా.. అందులో పెట్టుబడి పెట్టి గ్రీన్‌ కార్డు వచ్చినవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టును ఈబీ-5గా చిత్రీకరిస్తూ ప్రవాసాంధ్రుల సొమ్ముల కోసం గాలమేస్తున్న కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఏమిటీ ఈబీ-5..?

అమెరికా కాంగ్రెస్‌ 1990లో ‘ఎంప్లాయుమెంట్‌ బేస్డ్‌ (ఈబీ)-5’ ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టే అర్హులైన విదేశీయులు, వారి కుటుంబ సభ్యులకు రెండు నెలల్లో వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు. అనంతరం యూఎ్‌ససీఐఎస్‌ ప్రచురించే వీసా డేట్లు పెట్టుబడిదారుడి దరఖాస్తు తేదీతో సరిపోలినప్పుడు దరఖాస్తును సమగ్రంగా సమీక్షించి రెండేళ్ల పాటు షరతులతో కూడిన గ్రీన్‌కార్డును అందిస్తుంది. ఆ తర్వాత, పెట్టుబడి నిజాయితీగా ఉపయోగించారని, అవసరమైన ఉద్యోగ కల్పన పూర్తయిందని నిరూపించగలిగితే, వారు శాశ్వత గ్రీన్‌కార్డు పొందుతారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1.35 లక్షల మందికి పైగా విదేశీయులు ఈబీ-5 ద్వారా అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందారని నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో అత్యధికంగా దరఖాస్తుదారులు వచ్చినా, వాస్తవంగా గ్రీన్‌కార్డు పొందేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈబీ-5లో పెట్టుబడి పెట్టే వారికి ఒక్కరికే కాకుండా జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా గ్రీన్‌కార్డు మంజూరు చేస్తారు. ఈబీ-5 పెట్టుబడికి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. సాధారణ పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడికి కనీసంగా రూ.9 కోట్లు అవసరం. అలాగే అధిక నిరుద్యోగిత ఉన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు కనీసం రూ.7 కోట్లు (8 లక్షల డాలర్లు) పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడికి ప్రధాన నిబంధన.. ప్రతి ఈబీ-5 ప్రాజెక్ట్‌ ద్వారా కనీసం పది మంది అమెరికా చట్టబద్ధ నివాసితులకు/ ప్రవాసులకు/ వలసదారులకు, అమెరికన్‌ పౌరులకు పూర్తిస్థాయి ఉద్యోగాలు, కనీసం రెండేళ్ల పాటు జీవిత బీమా కల్పించాలి.

రాబడి.. వర్క్‌ పర్మిట్‌ ప్రయోజనాలు

అమెరికా ఇమిగ్రేషన్‌ సంస్థ యూఎ్‌ససీఐఎస్‌ గుర్తించిన రీజినల్‌ సెంటర్ల ద్వారానే దాదాపు 95ు ఈబీ-5 ప్రాజెక్ట్‌ దరఖాస్తులు వస్తాయి. ఈ రీజినల్‌ సెంటర్ల ద్వారా లైసెన్స్‌ పొందిన వారు ప్రాజెక్ట్‌ యజమానులుగా ముందుకు వచ్చి, యూఎ్‌ససీఐఎస్‌ నుంచి లభించిన ప్రాజెక్ట్‌ రసీదు చూపి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. ఆ రసీదు ఆధారంగా ప్రాజెక్టును నమ్మి, నిధులు పెడతారు. ఈ పెట్టుబడిలో ఒక్క డాలరు కూడా యూఎ్‌ససీఐఎ్‌సకుగానీ అమెరికా ప్రభుత్వానికి గానీ వెళ్లదు. ప్రాజెక్టును ప్రారంభించిన వారి ఖాతాల్లోకి వెళ్తుంది. ఉదాహరణకు.. ఒక ప్రవాసుడు తన సొంత భూమి 15 ఎకరాల్లో రూ.87 కోట్ల (కోటి డాలర్లు)తో షాపింగ్‌ మాల్‌ నిర్మాణ ప్రణాళికను ప్రతిపాదిస్తారు. తన ప్రాజెక్ట్‌ ఖాతాలో రూ.21 కోట్లు (25 లక్షల డాలర్లు) ఉన్నట్లు చూపించి, మిగిలిన మొత్తానికి 10 ఈబీ-5 గ్రీన్‌కార్డు ఇన్వెస్టర్‌ పిటిషన్ల ద్వారా సమీకరిస్తానని యూఎ్‌ససీఐఎస్‌ రీజినల్‌ సెంటర్‌కి నివేదిక సమర్పిస్తారు. రశీదు పొందిన అనంతరం ప్రాజెక్ట్‌ను ప్రచారం చేస్తూ ఈబీ-5 పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. ఒక్కో ఈబీ-5 పెట్టుబడిదారు తన శక్తి మేర రూ.7 కోట్ల వరకు ప్రాజెక్ట్‌లో పెడతారు. ఈ పెట్టుబడికి మూడేళ్ల పాటు కేవలం 0.25ు నుంచి 1ు మాత్రమే ప్రాజెక్టు ఓనర్లు పెట్టుబడిదారులకు చెల్లిస్తారు. అంటే రూ.7 కోట్ల పెట్టుబడికి మూడేళ్లకు గరిష్ఠంగా వచ్చేది రూ.21 లక్షలు అన్నమాట! కానీ, ప్రాజెక్ట్‌ ఓనర్లు కాగితం మీద చూపిన రూ.21 కోట్ల పెట్టుబడికి లభించే బహుమతి... అతి చౌకగా 10 మంది ఈబీ-5 ఆశావహుల కష్టార్జితమైన రూ.70 కోట్లు.


ఇక ప్రాజెక్టులో పెట్టుబడిదారుల సంఖ్య 10 మందితో ఆగిపోతే అది నిజమైన, నమ్మకమైన ప్రాజెక్టుగా పరిగణించవచ్చు. కానీ, ప్రస్తుత మార్కెట్‌లో ఈ పరిస్థితి లేదు. రూ.7 కోట్లు పెట్టలేనివారు కొద్ది మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చని ప్రాజెక్ట్‌ యజమానులు భరోసా ఇస్తారు. మిగిలిన మొత్తం తాము సర్దుబాటు చేస్తామని చెబుతారు. యూఎ్‌ససీఐఎ్‌సతో ఇబ్బంది తలెత్తకుండా ఓనర్లు తాము ఇచ్చే సొమ్మును 10-15ు వడ్డీకి ఇస్తున్నట్లు నకిలీ దస్తావేజులు రూపొందిస్తున్నారు. అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ ఉంటే ఏ ఉద్యోగమైనా చేసుకునేందుకు వీలుండడం వల్ల ఆర్థికంగా బలహీనమైన పెట్టుబడిదారులు కూడా ఈబీ-5 వైపు మొగ్గుచూపుతున్నారు. ఎంతో కొంత పెట్టుబడి పెట్టి వర్క్‌ పర్మిట్‌ తెచ్చుకుంటున్నారు. ఇలా పర్మిట్‌ తెచ్చుకున్న వారు తమ పేరిట సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలూ చేస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో దీర్ఘకాలం నివసించాలనే ఆలోచన ఉండదు. అక్కడ ఉన్నన్ని రోజులు డబ్బు సంపాదించుకొని వెళ్లిపోవడమే వారి ప్రధాన ఉద్దేశం. పెట్టుబడిదారుడు అమెరికాలో ఉంటేనే ఈ వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు. అమెరికా బయట ఉండి కూడా ఈబీ-5 ప్రోగ్రామ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాంటివారి దరఖాస్తులను యూఎ్‌ససీఐఎఎస్‌ క్షుణ్ణంగా సమీక్షించి, నిధుల మూలాలను నిర్ధారించుకున్నాక ఇమిగ్రెంట్‌ వీసా జారీ చేస్తారు. దాని ఆధారంగా అమెరికా వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు షరతులతో కూడిన గ్రీన్‌కార్డు ఇస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యాక షరతుల్లేని శాశ్వత గ్రీన్‌కార్డు మంజూరు చేస్తారు.

కాదేదీ ఈబీ-5 ప్రాజెక్టుకు అనర్హం

ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా వచ్చిన ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద ఉద్యోగాలు కల్పిస్తే ఎలాంటి ప్రాజెక్టునైనా చేయవచ్చుననే నిబంధన ఉంది. దీన్ని ఆసరగా చేసుకుని కూరగాయల మార్కెట్లు, సిమెంట్‌ ఇటుకల బట్టీలు, హోటళ్లు, కాఫీ షాపులు, అపార్ట్‌మెంట్లు, రిసార్టులు, పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటితో పాటు చివరికి క్యాసినోలను కూడా ఈబీ-5 ప్రాజెక్టులుగా ప్రారంభిస్తున్నారు. అందినంత మేర పెట్టుబడులు లాగేస్తున్నారు. గతంలో ఒక ఇల్లు కొనడాన్ని కూడా ఈబీ-5 పెట్టుబడిగా ఆమోదించి, గ్రీన్‌కార్డులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి.


పెద్ద కుట్రే..

యూఎ్‌ససీఐఎ్‌సకు సమర్పించే దరఖాస్తులో ప్రాజెక్ట్‌ ప్లాన్‌ ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావాలి. యజమాని నిజంగానే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే, యూఎ్‌ససీఐఎస్‌ ఉద్యోగ సృష్టి, పెట్టుబడి నిబంధనలు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తుంది. దీంతో పెట్టుబడిదారులు ప్రధాన గ్రీన్‌కార్డులను పొందుతారు. కానీ, అత్యాశపరులైన ప్రాజెక్ట్‌ ఓనర్లు యూఎ్‌ససీఐఎ్‌సకు పంపిన దరఖాస్తులో పేర్కొన్నట్లు కాకుండా ఎక్కువ మందిని పెట్టుబడిదారులుగా చేర్చుకుంటున్నారు. తద్వారా వారికి అతి చౌకగా అత్యధిక మూలధనం లభిస్తోంది. పెట్టుబడిదారులకు మాత్రం ఆశించిన ప్రయోజనం దక్కట్లేదు. ప్రాజెక్టులో రూ.7 కోట్లు చెల్లించినవారి గ్రీన్‌కార్డు దరఖాస్తులను మాత్రమే యజమానులు యూఎ్‌ససీఐఎ్‌సకు సిఫారసు చేస్తున్నారు. చిన్నాచితకా సొమ్ములు పెట్టినవారు వర్క్‌ పర్మిట్‌ వద్దనే ఆగిపోతున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇలాంటి వారి వర్క్‌ పర్మిట్‌ రద్దయి, డబ్బులు పోగొట్టుకుని, తిరిగి పాత వీసా పరిధిలోకి వెళ్లిపోతున్నారు. మళ్లీ మరో ఈబీ-5 ప్రాజెక్టు వెతుక్కొని, అందులో పెట్టుబడి పెట్టి, వర్క్‌ పర్మిట్‌ తెచ్చుకోవడమనే సుడిగుండంలో పడిపోతున్నారు. ఈబీ-5 ప్రక్రియకు ప్రత్యేకమైన న్యాయవాదులు ఉంటారు. ప్రాజెక్ట్‌ యజమానులతో చేతులు కలిపి వీరు పోషించే పాత్ర కూడా ప్రధానం. అసలు ఈబీ-5 ప్రాజెక్టులకు రూపకల్పన చేసేదే అతి చౌకగా మూలధనం సేకరించడానికని డల్లా్‌సకు చెందిన ఒక టెకీ తెలిపారు. అలా వచ్చిన పెద్దమొత్తాలను ప్రాజెక్ట్‌ యజమానులు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు భారత్‌లో పెట్టుబడులు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు కూడా వాడుతున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిజమైన ఈబీ-5 ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

విజేతలు కాదు.. బాధితులు..

అమెరికాలో స్థిరపడి తమ వ్యాపారాల ద్వారా సంపాదించిన నిధులతో కొందరు ప్రవాసాంధ్రులు టెన్నిస్సీ, అరిజోనా, నార్త్‌ కరోలినా, టెక్సాస్‌, జార్జియా వంటి రాష్ట్రాల్లో కొత్త ఈబీ-5 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు తెరలేపుతున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి అటు ప్రాజెక్ట్‌ రూపకర్తలు, ఇటు పెట్టుబడిదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, మెజారిటీ పెట్టుబడిదారులు విజేతలుగా కంటే బాధితులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికే మూడు, 4 ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడిదారులను ముంచేసినా, మరొకరిని తమ ప్రాజెక్టుల యజమానులుగా చెప్పుకొని వెనక నుంచి కొందరు బడాబాబులు ఈ దందా నడిపిస్తున్నారు. ఈబీ 1,2,3 కేటగిరీల్లో 10-20 ఏళ్లకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఈబీ-5లో డబ్బులు పెడితే వర్క్‌ పర్మిట్‌ వచ్చి టెన్షన్‌ లేకుండా కావల్సిన పని చేసుకోగలగడం ఈ పథకానికి ఉన్న అతిపెద్ద బలం. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద తలకాయలు, రాజకీయ నేతలు రెండేళ్లుగా తమకు, తమ సంతానానికి ఈబీ-5 ద్వారా ఇమిగ్రెంట్‌ వీసా తెచ్చుకుని, అమెరికాలో దిగే సమయానికి షరతులతో కూడిన గ్రీన్‌ కార్డును అందుకుంటున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:36 AM