Honorary Doctorate at Palamuru University: ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణరెడ్డికి డాక్టరేట్ ప్రదానం
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:06 AM
విద్య.. ఉద్యోగం సాధించడం కోసమే కాదని, వ్యక్తిత్వం, విలువలు, సంస్కృతి పరిరక్షణ, సేవాభావం పెంపుదల అన్నీ కూడా విద్యతోనే...
వర్సిటీలు ఆధునిక దేవాలయాలు
పాలమూరు వర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ
మహబూబ్నగర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్య.. ఉద్యోగం సాధించడం కోసమే కాదని, వ్యక్తిత్వం, విలువలు, సంస్కృతి పరిరక్షణ, సేవాభావం పెంపుదల అన్నీ కూడా విద్యతోనే సాధ్యమవుతాయని రాష్ట్ర గవర్నర్, పాలమూరు యూనివర్సిటీ చాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆధునిక దేవాలయాలుగా ఉన్న యూనివర్సిటీలు యువతను దేశాభివృద్ధిలో మార్గదర్శకులుగా మార్చాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో గురువారం నిర్వహించిన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎ్సఎన్ లేబొరేటరీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డికి వర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అలాగే మరో 12 మందికి డాక్టరేట్ పట్టాలు, 83 మందికి బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స్నాతకోత్సవం అనేది పట్టాల పంపిణీ వేడుక మాత్రమే కాదని, ఇది విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భమని పేర్కొన్నారు. నేర్చుకున్న విద్యను వివిధ రంగాల్లో రాణించడానికే కాకుండా మానవత్వ విలువల పెంపునకు, తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి కృషి చేయాలని సూచించారు. పాలమూరు వర్సిటీ దశాబ్ద కాలంలో ప్రశంసనీయ అభివృద్ధి సాధించిందని, పరిశోధనలు పెరిగి కొత్త ఆవిష్కరణలు రావాలని ఆయన ఆకాంక్షించారు.