Road Accident in USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం..మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:08 AM
అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి...
మంచిర్యాల క్రైం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన రిటైర్డు సింగరేణి ఉద్యోగి పాత విగ్నేశ్, రమాదేవి (52) దంపతులకు స్రవంతి, తేజస్విని ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ వివాహాలు జరగ్గా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కూతురు తేజస్విని (30) నూతన గృహ ప్రవేశం ఉండడంతో విగ్నేశ్, రమాదేవి సెప్టెంబరు 15న అమెరికాకు వెళ్లారు. షికాగోలో ఉంటున్న పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడి జన్మదినం సందర్భంగా శనివారం విగ్నేశ్, రమాదేవి, తేజస్విని, తేజస్విని భర్త కిరణ్ కారులో స్రవంతి ఇంటికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్కు ఢీకొనడంతో రమాదేవి, తేజస్విని అక్కడికక్కడే మృతి చెందారు. విగ్నేశ్, అల్లుడు కిరణ్కు గాయాలైనట్లు సమాచారం.