తప్పిన సాగునీటి ఇక్కట్లు
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:38 AM
రైతన్నల బాధను తోటి రైతే పంచుకున్నాడు. సాగు నీటి కోసం పరితపిస్తున్న సాటి అన్నదాతల ఆర్తిని గుర్తించాడు.
తప్పిన సాగునీటి ఇక్కట్లు
కాల్వ తవ్వకానికి రైతు సుభా్షరెడ్డి అంగీకారం
పర్రెకుంటకు, ముత్యాలమ్మ చెరువుకు అందనున్న కృష్ణాజలాలు
సాగు చేసిన పత్తి, వరి పంటపై రైతుల్లో వికసిస్తున్న ఆశలు
నార్కట్పల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రైతన్నల బాధను తోటి రైతే పంచుకున్నాడు. సాగు నీటి కోసం పరితపిస్తున్న సాటి అన్నదాతల ఆర్తిని గుర్తించాడు. ఎవుసం కోసం ఎద్దే కాదు.. రైతూ ఏడవకూడదని సంకల్పించాడు. చెరువులోకి నీరు చేరేలా తన భూమిలో నుంచి మైనర్ కాల్వ తవ్వడానికి ఒప్పుకుని పెద్ద మనసు చాటుకున్నాడు. దీంతో సుమారు 3 వేల ఎకరాలకు సాగునీరందే నీటి తరలింపునకు మార్గం సుగమమైంది. కాల్వ తవ్వకం పూర్తికావస్తుండగా ఇక పారాల్సింది కృష్ణా జలాలే, సాగు నీటిని తరలించేలా కాల్వ తవ్వకానికి ముందుకొచ్చిన రైతు మంచితనానికి తోటి రైతులు అభినందనలు తెలుపుతున్నారు. నార్కట్పల్లి మండలంలోని అవురవాణి కరువు పీడిత గ్రామం. బీ.వెల్లెంల ఉదయసముద్రం రిజర్వాయర్ పూర్తయినా గ్రామంలోని చెరువులను నింపాల్సిన కాల్వల తవ్వకం పూర్తి కాలేదు. పైగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు ఎండిపోయాయి. దీంతో ఉదయసముద్రం ఎడమకాల్వ ద్వారా గ్రామంలోని పర్రెకుంట, ముత్యాలమ్మ చెరువు, అప్పాజిపేట చెరువుకు నీరు చేరవేసేందుకు కాల్వ తవ్వాల్సి ఉంది. కానీ ఇదే గ్రామానికి చెందన కాలం సుభా్షరెడ్డితో పాటు అతని సోదరుని భూమి నుంచి తవ్వాల్సి ఉంది. దీంతో గ్రామస్థులందరూ వారిని సంప్రదించారు. నీటి గోసను వారితో పంచుకున్నారు. స్పందించిన సుభా్షరెడ్డి తన భూమిలో నుంచి సుమారు 800 మీటర్ల వరకు కాల్వ తవ్వకానికి సరేనన్నాడు. ఇంకేముంది రైతులందరూ చందాలు వేసుకుని 3 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతుతో సుమారు రూ.2లక్షల రూపాయల ఖర్చుతో కాల్వను పర్రెకుంట వరకు తవ్వించుకున్నారు. రేపో మాపో కృష్ణాజలాలు ప్రధాన కాల్వ నుంచి పర్రెకుంటకు చేరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బోర్లు ఎండిపోయాయి
వానలు పడకపోవడంతో బోరు బావులు ఎండిపోయాయి. వరి పైరుకు నీరందించలేని దుస్థితి. గతేడాదే కొంతమంది రైతులు ట్రాక్టర్ల ద్వారా వరిపైరుకు నీటిని అందించారు. ఈ సారీ అదే పరిస్థితి ఎదురైనా కాలం సుభా్షరెడ్డి ఓ రైతుగా గ్రామానికి చెందిన బాధలను అర్థం చేసుకున్నాడు. కాల్వ తవ్వకానికి ఏ మాత్రం వెనుకాడలేదు. చందాలు వేసుకుని కాల్వ తవ్వించాం. సుభా్షరెడ్డికి గ్రామ రైతుల తరపున కృతజ్ఞతలు.
- కల్లూరి కంఠ్లం, రైతు, అవురవాణి
రైతుగా గోస చూడలేక
అవురవాణి అంటేనే అసలే కరువు ప్రాంతం. వర్షాధారం తక్కువే. బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయడమే. ఈ పర్యాయం కూడా వానలు లేవు. బీ.వెల్లెంల రిజర్వాయర్ నుంచి రైతులు తమ గ్రామాలకు మైన ర్ కాల్వలను తవ్వి తీసుకెళ్తున్నారు. మా గ్రామానికి చెందిన రైతులు కూడా ఇదే ఆలోచన చేశా రు. నా భూమి లో సుమారు 800 మీటర్ల నిడివిలో కాల్వ తవ్వాల్సి ఉంది. రైతుగా సాటి రైతు కష్టాలను తెలిసి ఒక్క మాటతోనే సరేనన్నాను.
- కాలం సుభా్షరెడ్డి, అవురవాణి