Ponguleti Srinivas Reddy: పేదల భూ హక్కులపై మానవీయతచూపండి
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:48 AM
దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న పేదలకు భూహక్కుల కల్పనపై మానవీయ కోణంలో పని చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు..
అటవీ, రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న పేదలకు భూహక్కుల కల్పనపై మానవీయ కోణంలో పని చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని భూ సమస్యలపై ఆయన సమీక్షించారు. చిన్న సమస్యల సాకుగా భూ సమస్యలను జటిలం చేయొద్దని అటవీశాఖ అధికారులకు హితవు చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో 40-50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కుల కల్పనకు తమ సర్కారు చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని తిరుమలగిరి మండలంలో 235 సర్వేనంబర్ల పరిధిలో 23 వేల ఎకరాలపై జరిపిన ప్రయోగాత్మక సర్వేలో 12 వేల ఎకరాల భూమి ప్రభుత్వానిదని తేలిందన్నారు. ఇదే సర్వేలో గుర్తించిన 7,000 ఎకరాల అటవీ భూమి పరిధిలోని వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు.