Minister Seethakka: బుల్లెట్ బండి ఎక్కిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:37 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం..
ములుగు ఎస్పీతో కలిసి మేడారంలో పర్యటన
హైదరాబాద్/తాడ్వాయి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేసేందుకు ఎడ్లబండ్ల రహదారులను ఎస్పీ శబరీశ్తో కలిసి పరిశీలించారు. మంత్రి కాన్వాయ్ వెళ్లలేని పరిస్థితి ఉండగా బుల్లెట్ బండిపై ఆమె ప్రయాణించారు. ఎస్పీ బుల్లెట్ నడపగా వెనుక మంత్రి కూర్చొని.. కాల్వపల్లి నుంచి కన్నెపల్లి, మేడారం నుంచి కొండపర్తి రహదారులను, జంపన్నవాగులో వరదకు కొట్టుకుపోయిన లోలెవల్ కాజ్వేలను పరిశీలించారు. మేడారం అభివృద్ధికి సీఎం సుముఖంగా ఉన్నారని, కొందరు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పోషకాహార లోపాన్ని నివారించాలి
చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబరు 16 వరకు ‘పోషణ మాసం’ నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఇంటికి పోషకాహారం సందేశాన్ని అంగన్వాడీ సిబ్బంది ద్వారా చేరవేర్చడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. నెల రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా పోషకాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, బాలల సంరక్షణ, పరిశుభ్రత, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తారు. ఆయా కార్యక్రమాల విజయవంతానికి ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.30వేలు, ప్రతి జిల్లాకు రూ.50వేల చొప్పున ఇప్పటికే నిధులు మంజూరు చేశారు.