Minister Ponguleti Srinivas Reddy: కారుకూతలకు జూబ్లీహిల్స్ ఫలితమే సమాధానం
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:38 AM
ప్రభుత్వంపై కొందరు చేస్తున్న కారుకూతలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు వంటి సమాధానమని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ ఇళ్లలో లక్షకుపైగా పునాది దశలోనే.. అదీ వారి పనితీరు
మేం రూ.25,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశాం
ప్రజాప్రభుత్వానికి అండగా నిలవండి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లెందులో అభివృద్ధి పనులు ప్రారంభం
ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
ఇల్లెందుటౌన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంపై కొందరు చేస్తున్న కారుకూతలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు వంటి సమాధానమని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి తెలిపారు. ఈ ఉపఎన్నిక ఫలితాలపై కొందరు ఇప్పటికీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పర్యటించిన మంత్రి రూ.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లలో సుమారు లక్ష ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయని, ఈ పరిస్థితి వారి పనితీరుకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. అలాంటి వారు.. నిత్యం పేదల కోసం పని చేస్తున్న తమ ప్రజాప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.25,500 కోట్లు కేటాయించామని, నాలుగున్నర లక్షల ఇళ్లను ఇప్పటికే మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరుగుతోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన 243 మంది ఎస్టీ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.