Excise Minister Jupalli Krishnarao: ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న కేసీఆర్
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:32 AM
నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా మార్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాగోతంపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని....
అబద్ధాల కేసీఆర్ బాగోతంపై చర్చ జరగాలి: మంత్రి జూపల్లి
వనపర్తి టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా మార్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాగోతంపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 4 సార్లు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తోలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తప్పుడు ఆరోపణలపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న కేసీఆర్.. తాను పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీతో అంట కాగినా ఆ ప్రాజెక్టులకు అవసరమైన కాలువలు, డిస్ట్రిబ్యూటర్లకు నీటి అనుమతులు, పర్యావరణ అనుమతులెందుకు తేలేదని ప్రశ్నించారు. వివిధ కారణాలతో 2022లోనే ప్రాజెక్టు డీపీఆర్ఐ వాపస్ వచ్చిందని చెప్పారు. 22 మంది సీఎంలు చేయలేని అప్పులు చేసిన కేసీఆర్.. 2023 ఎన్నికల్లో అన్నదాతలకు రైతు బంధు నిధుల విడుదలకు ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను రూ.7,000 కోట్లకు విక్రయించారని మండి పడ్డారు.