Sridhar Babu: రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:49 AM
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు.
సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో కేంద్రం వివక్ష
కనీస సంసిద్ధతలేని ఆంధ్రప్రదేశ్కు ఎలా కేటాయిస్తారు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యాయం చేయాలి: శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపి రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని బుధవారం మండిపడ్డారు. ‘ప్రపంచ స్థాయి అధునాతన సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మహేశ్వరంలో పదెకరాల భూమి కేటాయించాం. అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలుపెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు.
అయినా కేంద్రం పట్టించుకోలేదు’ అని విమర్శించారు. అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధతలేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని శ్రీధర్ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు.