Fine Rice Scam: సన్న బియ్యం కొంటాం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:59 AM
సర్కారు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుల నుంచి దళారులు కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ.20-25 చెల్లించి సన్న బియ్యం తీసుకుని మార్కెట్లో అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు

లబ్ధిదారుల చుట్టూ దళారుల ప్రదక్షిణలు
కిలోకు 20 నుంచి 25 వరకు ధర
ఆటోల్లో పల్లెలు, పట్టణాల్లో సంచారం
దొడ్డు బియ్యం తినేవాళ్లే లక్ష్యంగా చక్కర్లు
నిఘా పెంచకుంటే మళ్లీ అక్రమ రవాణా
సంగారెడ్డి, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకానికీ దళారులు తూట్లు పొడుస్తున్నారు. మొన్నటి దాకా పల్లెలు పట్టణాల్లో దొడ్డు బియ్యం కొంటామంటూ తిరిగిన వారు.. ఇప్పుడు సన్న బియ్యం కొంటామంటూ చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇదేతీరులో రాష్ట్ర వ్యాప్తంగా దళారుల దందా సాగుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగానే లబ్ధిదారులు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో వంద శాతం సన్న బియ్యం పంపిణీని పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. అయితే, గతంలో దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమ రవాణాకు పాల్పడిన ముఠాలు.. ఇప్పుడు సన్న బియ్యం కొనుగోలు చేస్తామంటూ తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో సన్న బియ్యం తినే వారిని లక్ష్యంగా చేసుకుని.. దొడ్డుబియ్యాన్ని కిలోకు రూ.10-15 దాకా చెల్లించి కొనుగోలు చేసేవారు.
ఇప్పుడేమో దొడ్డు బియ్యం తినే వాళ్ల వద్ద రూ.20-25 దాకా ధర నిర్ణయించి సన్న బియ్యం కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా దొడ్డు బియ్యం తినే అలవాటు ఉన్న వారికి సన్న బియ్యం రుచించవు. ఇలాంటి వారు మార్కెట్లోని పలు దుకాణాల్లో సన్న బియ్యాన్ని కిలో రూ.25 లెక్కన ఇచ్చి.. దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నట్లు తెలిసింది. అలాగే, తమ పొలంలో పండిన బియ్యాన్ని తినే రైతులు కూడా రేషన్ ద్వారా వచ్చే సన్న బియ్యాన్నే వినియోగించడం లేదన్న అంచనాలున్నాయి. ఈ రెండు వర్గాల వారే లక్ష్యంగా దళారులు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతున్నారు. లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.25చొప్పున కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని మార్కెట్లో రూ.40చొప్పున విక్రయించడానికి సిద ్ధమవుతున్నారు. దీనిపై సర్కారు నిఘా పెంచకపోతే మళ్లీ అక్రమ రవాణా జోరందుకునే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.