షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:33 PM
షెడ్యూల్డ్ కులముల, తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : షెడ్యూల్డ్ కులముల, తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కేసులు కార్యచరణ ప్రకారంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో తప్పుడు కేసులు నమోదు చేసిన వాటి వివరాలను స్పష్టంగా రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులో వివరాలు సక్రమంగా ఉంటే సమగ్ర విచారణ జరిపి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సమావేశంలో చర్చించిన ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించగా కొంత మేర మంజూరు చేయడం జరిగిందని, సదరు పరిహారం మొత్తాన్ని బాధితులకు అందించామని తెలిపారు. షెడ్యూల్డు కులములు, తెగలకు చెందిన సంక్షేమ వసతి గృహాలుని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాసరావు, షెడ్యూల్డు కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గా ప్రసాద్, ఎస్సీ, ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు నారాయణ, రాజనర్సు, రాజారావు, ఎల్లయ్య, రాజన్న, అధికారులు కృష్ణమూర్తి, కిషన్, పురుషోత్తం నాయక్, భాగ్యవతి, అంజయ్య వెంకటేశం పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.