kumaram bheem asifabad- గిరిజన గ్రామాలకు మహర్దశ
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:49 PM
గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. గిరిజన ఆవాసాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు, వారి కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం- జుగా) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పథకంలో భాగంగా గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం, మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్, ఆరోగ్య, పోషకాహార, విద్య, విద్యుత్తో పాటు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
- జిల్లాలో 102 గ్రామాలు ఎంపిక
- 30 వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
లింగాపూర్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. గిరిజన ఆవాసాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు, వారి కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం- జుగా) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పథకంలో భాగంగా గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం, మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్, ఆరోగ్య, పోషకాహార, విద్య, విద్యుత్తో పాటు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 102 గిరిజన గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పినకు కేంద్రం నిధులు మంజూరు చేయనున్నది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహో అభియాన్ను ఉన్నతీకరించారు. దీన్ని ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్గా మార్చారు.
- సౌకర్యాల కల్పన ఇలా..
ఆయా గ్రామాల్లో రహదారులు, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సొంతగూడ లేని వారికి పక్కా ఇళ్లు మంజూరుతో పాటు నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయనున్నారు. సౌర వెలుగులకు అవసరమైన పరికరాలు అందజేయనున్నారు. పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఆయుష్మాన్భవ కార్డులు జారీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు లేని చోట ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందజేస్తారు. విద్య, నైపుణ్యాలకు దూరంగా ఉంటున్న గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. గిరిజనులు పండించే పంటలను మార్కెట్కు తరలించి, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటారు.
- ఎంపిక చేసిన గ్రామాలు..
జిల్లాలోని పీఏం జుగా పథకం కింద ఎంపికైన గ్రామాలు ఇలా ఉన్నాయి. లింగాపూర్ మండలంలో ఎనిమిది గ్రామాలను ఎంపిక చేశారు. అందులో చోర్పల్లి, కంచన్పల్లి, కొత్తపల్లి, లింగాపూర్, జాముల్ధర, లొద్దిగూడ, వంకమద్ది, గూమ్నూర్ బి, ఉన్నాయి. తిర్యాణిలో 33, జైనూర్లో 15, సిర్పూర్(యు)లో 14, వాంకిడిలో ఎనిమిది, కెరమెరిలో ఏడు, ఆసిఫాబాద్ మండలంలో నాలుగు, బెజ్జూరులో నాలుగు, కాగజ్నగర్లో నాలుగు, చింతలమానేపల్లిలో మూడు, రెబ్బెన మండలంలో ఒకటి, కౌటాలలో ఒక గ్రామాలను ఎంపిక చేశారు.
- ఐదేళ్ల ప్రణాళికతో ముందుకు..
జిల్లాలో ఈ విషన్ ద్వారా రానున్న ఐదేళ్లకాలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో గిరిజనుల సామాజిక అర్థికాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతారు. ఈ పథకంలో 19 ప్రభుత్వ శాఖలు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. ఆయా శాఖలు ఎంపిక చేసి గ్రామాల్లో కావల్సిన మౌలిక సదుపాయాల వివరాలు సేకరించి అందజేస్తాయి. ఇందుకోసం ఈనెల 30వ తేదీ వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాయి. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సంరక్షణ సదుపాయాలను పరిశీలిస్తారు. వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటిని కలెక్టర్ ద్వారా పీఎం జుగా మిషన్ అధికారులకు అందజేసిన అనంతరం వెనువెంటనే వాటికయ్యే నిధులను అందజేస్తారు. ఆ నిధులతో గుర్తించిన పనులు చేపడుతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
జిల్లాలో 102 గ్రామాల ఎంపిక..
- రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్
జిల్లాలో మొత్తం 102 గ్రామాలను ఎంపిక చేశాం. ఈగ్రామాలకు ప్రత్యేకాధికారులుగా ఏస్సీఈఆర్పీలను నియమించాం. ఇందులో 19 శాఖలను అనుసంధానం చేసి గ్రామాల్లో అవసమైన మౌలిక సదుపాయాల వివరాలు సేకరిస్తున్నాం.