Share News

Mahagathbandhan Alliance: బిహార్‌లో మహాగట్‌బంధన్‌దే గెలుపు

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:17 AM

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రె్‌స-ఆర్జేడీ-వామపక్షాలతో కూడిన మహాగట్‌బంధన్‌ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ బిహార్‌ ఎన్నికల పరిశీలకులు...

Mahagathbandhan Alliance: బిహార్‌లో మహాగట్‌బంధన్‌దే గెలుపు

  • ఓట్ల కుంభకోణాన్ని బయటపెట్టి రాహుల్‌విజయానికి ముందే బాటలు వేశారు

  • సీఎంగా నితీశ్‌ అన్ని రంగాల్లోనూ విఫలం..

  • అధికారం కోసమే బీజేపీ-జేడీయూ పొత్తు

  • బిహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రె్‌స-ఆర్జేడీ-వామపక్షాలతో కూడిన మహాగట్‌బంధన్‌ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ బిహార్‌ ఎన్నికల పరిశీలకులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే బిహార్‌ ప్రజలను చైతన్య పరిచారని, రాష్ట్రంలో జరిగిన ఓట్ల కుంభకోణాన్ని ప్రజలకు వివరించి మహాఘట్‌బంధన్‌ విజయానికి బాటలు వేశారన్నారు. ఇటీవల మహిళలకు తాయిలాలను పంచిన ప్రధాని మోదీ.. ఒక విధంగా వారి కూటమి ఓటమిని ముందుగానే అంగీకరించారని ఎద్దేవా చేశారు. బిహార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడిగా పట్నా నుంచి పర్యటన ప్రారంభించిన మంత్రి పొంగులేటి.. శనివారం పశ్చిమ చంపారన్‌ జిల్లా నూతన్‌ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి అమిత్‌గిరి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. సీఎంగా నితీశ్‌ కుమార్‌ అన్ని రంగాల్లో విఫలమయ్యారని.. ఈసారి ఆయన్ను ప్రజలు తిరస్కరించబోతున్నారని చెప్పారు. బిహార్‌లో నితీశ్‌-బీజేపీ పాలన కేవలం మాటలకే పరిమితమైందని.. వాస్తవానికి ఇది అసమర్థ పాలన అని విమర్శించారు. బిహార్‌లో పెరిగిన నిరుద్యోగంతో యువత నిరాశలో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తోందని చెప్పారు. అందువల్లే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బిహార్‌ యువకులే కనిపిస్తున్నారని.. ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. బీజేపీ-జేడీయూ పొత్తు కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని.. సీఎం నితీశ్‌ నీతిబాహ్య చర్యలకు పాల్పడుతుంటారని ఆరోపించారు. నామినేషన్‌కు ముందు కాంగ్రెస్‌ వార్‌ రూంలో ఎన్నికల వ్యూహంపై స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో చర్చించారు.

Updated Date - Oct 19 , 2025 | 04:17 AM