TG High Court: చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు
ABN , Publish Date - May 14 , 2025 | 06:18 AM
హైకోర్టు స్పష్టం చేసింది చెరువు ఎఫ్టీఎల్ భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని. బాధితుల వాదనలు విని, టైటిల్ పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
తుది నోటిఫికేషన్కు ముందు బాధితుల వాదన వినండి : హైకోర్టు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే దాన్ని క్రమబద్దీకరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్ సరిహద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఎదుటి పక్షం వాదనలు వినాలని తెలిపింది. సరిహద్దు లోపల ఉన్న భూమిపై హక్కులు క్లెయిం చేసే వారి వాదన వినాలని, టైటిల్ పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదలశాఖల అధికారులకు తెలిపింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 175, 171లో పది ఎకరాల భూమిని ఓ కోర్టు ప్రొసీడింగ్స్లో జారీ అయిన ఆర్బిట్రేషన్ అవార్డు ద్వారా కూకట్పల్లికి చెందిన శ్రీసాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. ఆ భూమిలో కొంతభాగం స్థానిక అంబీర్ చెరువులో భాగంగా ఉందని గుర్తిస్తూ అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని.. తమ వాదన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొంటూ ఆ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం.. ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే అధికారులు చెరువుల హద్దులు గుర్తించే పనిచేపట్టారని తెలిపింది. అయితే హద్దులు గుర్తించే క్రమంలో నిజమైన పట్టాదారుల హక్కులకు భంగం కలగకుండా వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. ఆక్రమణల తొలగింపులో మాత్రం ఎవరినీ ఉపేక్షించే అవసరం లేదని పేర్కొంది. ట్యాంక్ బెడ్, బఫర్జోన్, ఎఫ్టీఎల్ భూములను రెగ్యులరైజ్ చేసే అధికార ప్రభుత్వానికి సైతం లేదని స్పష్టంచేసింది. ఈ కేసులో పిటిషనర్ వాదన విని, టైటిల్ పత్రాలు పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొంది.