CM Revanth Reddy: తెలంగాణ నోయిడా!
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:48 AM
కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ నోయిడాగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్ల పారిశ్రామికవాడను తీర్చిదిద్దుతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు...
అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం
ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3000-4000 ఎకరాలు ఇస్తున్నారు
రూ.5000 కోట్లతో కొడంగల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం
ఉస్మానియా క్యాంప్సలో లేని విభాగాలకూ ఇక్కడ చోటు
మూడేళ్లలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి
ఆర్థిక స్వాతంత్ర్యానికి పెద్దపీట వేశాం.. ఆడబిడ్డలు అండగా ఉండాలి
మూడు నాలుగు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్
కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
గ్రీన్ఫీల్డ్ కిచెన్కు భూమిపూజ... రూ.103 కోట్ల పనులకు శంకుస్థాపన
వికారాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ‘తెలంగాణ నోయిడా’గా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్ల పారిశ్రామికవాడను తీర్చిదిద్దుతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు లగచర్లలో భూ సేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి.. అమాయక రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించారని, దాంతో వారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తు చేశారు. తాము భూ నిర్వాసితులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని, దాంతో, లగచర్ల, హకీంపేట, పోలేపల్లిల్లో 3000-4000 ఎకరాల భూములను రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని తెలిపారు. సున్నం గనులు కొడంగల్ నియోజకవర్గంలో ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు కర్ణాటకలో ఉన్నాయని, త్వరలో ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. కొడంగల్ శివారు ఎన్కేపల్లి వద్ద హరేకృష్ణ సంస్థ - అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ కిచెన్ భవన నిర్మాణ పనులకు మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి సీఎం రేవంత్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. అల్పాహారం తయారీకి హరేకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నాం. ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని అన్న, అమ్మలా ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందుకే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. ఫలితంగా ఈ ఏడాదే ప్రభుత్వ పాఠశాలల్లో 5000 మంది విద్యార్థులు పెరిగారు’’ అని వివరించారు. నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా తీసుకున్నామన్నారు. గత 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొడంగల్ను 2034 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యమన్నారు. విద్య ఒక్కటే తరగని ఆస్తి అని, తెలంగాణ పున: నిర్మాణంలో ఇక్కడి పిల్లలను భాగస్వాములను చేసేందుకు రూ.5000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంప్సను నిర్మిస్తున్నామని చెప్పారు. ఉస్మానియా క్యాంప్సలో కూడా లేని విభాగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి గొప్ప చదువుల కోసం ఇక్కడికి వచ్చేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతోందని, త్వరలోనే ఇక్కడి ప్రజలు రైలు కూత వినబోతున్నారని, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా కర్ణాటకకు వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, రూ.5000 కోట్లతో నారాయణ్పేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు కృష్ణా జలాలను అందిస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వారిని వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, పెట్రోలు పంపులు, సోలార్ విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణను మహిళలకు అప్పగించి ఆర్థిక స్వాతంత్య్రం లభించేలా ప్రోత్సహిస్తున్నామని, అభివృద్ధికి ఆడబిడ్డలు అండగా నిలవాలని సీఎం రేవంత్ కోరారు. ప్రజలకు ఇవ్వడానికి అసైన్డ్ భూములు లేవని, కోట్లాది రూపాయలు లేవని, ప్రజలకు తాను చేయగలిగిందల్లా మంచి చదువులు చెప్పించడమేనని, సమస్యల పరిష్కారానికి చదువే మార్గమని, గొప్ప చదువులు చదివితే గొప్పవారిగా, ఉన్నతాధికారులుగా ఎదగవచ్చని వ్యాఖ్యానించారు.
మంచి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోండి
త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని, గ్రామాభివృద్ధికి సహకరించే వారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాకుం డా ప్రతి గ్రామంలో అవసరమైన కనీస, మౌలిక సదుపాయాలు ఉండేలా కృషి చేసే వారిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం నియోజకవర్గంలో స్వయం సహాయక సం ఘాలకు 300 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య నడపనున్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు.