National Herald scam: కాంగ్రెస్ ధర్నాలు.. సిగ్గుమాలిన చర్య
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:11 AM
కిషన్రెడ్డి కాంగ్రెస్ను నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో అవినీతి చేస్తూ, రాహుల్, సోనియా గాంధీలపై ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుల్ని ఒప్పుకోవాలని సూచించారు.
ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
కంచగచ్చిబౌలి ఫొటోలు నేనూ పోస్టు చేశా.. కేసు పెట్టుకోవచ్చు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో ఎన్నో సార్లు అవినీతి, అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్.. అదే తీరులో రూ.వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు స్థాపించుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రికతోపాటు సంబంధిత ఆస్తులను.. దొడ్డిదారిన రాహుల్, సోనియాగాంధీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపడితే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. చట్టం మీద విశ్వాసం ఉన్న వాళ్లు ధర్నాలు చేయరని, కాంగ్రెస్ నేతల ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూఠీ చేయాలన్న ఉద్దేశమే తప్ప.. సేవ చేయాలనే సంకల్పం లేదని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టేయాలన్న సోనియా, రాహుల్ అభ్యర్థనను 2016లోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. కానీ.. మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసు బయటకు వచ్చినట్లు.. సోనియా, రాహుల్ శుద్ధపూసలు అయినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కంచ గచ్చిబౌలి భూముల అంశంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పటికైనా ఒప్పుకోవాలని కిషన్రెడ్డి సూచించారు. అబద్ధాలు మానేసి.. ఆ భూముల్లో సుప్రీంకోర్టు చెప్పినట్లు మొక్కలను నాటే పని చేపడితే బాగుంటుందన్నారు. పోలీసు బందోబస్తు పెట్టి వంద ఎకరాల్లో చెట్లు నరకడం.. కాంగ్రెస్ దుర్మార్గానికి అద్దం పడుతోందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో జింకలు చనిపోయిన మాట వాస్తవం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫొటోలు పోస్టు చేసిన స్మిత సభర్వాల్కు తెలంగాణ సర్కారు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మీకూ ఏమైనా నోటీసులొచ్చాయా? అని విలేకరులు అడగ్గా.. కిషన్రెడ్డి ఘాటుగా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి తానూ ఎక్స్ వేదికగా ఫొటోలు పోస్టు చేశానని, తనపైనా ప్రభుత్వం కేసులు పెట్టుకోవచ్చని అన్నారు. అలాంటి కేసులకు తాను భయపడబోనని చెప్పారు.
ఇవి కూడా చదవండి...