Share News

kumaram bheem asifabad- కొత్తవారికేదీ.. కిసాన్‌ సమ్మాన్‌?

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:27 PM

పంటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాకు రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తోంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో నమోదైన రైతులకే పథకం వర్తిస్తోంది. ఆ తర్వాత పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరడం లేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా భూమిని పొందిన వారు, ఇతరుల నుంచి భూమికొనుగోలు చేసిన కొత్త పట్టాలు పొందిన వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

kumaram bheem asifabad- కొత్తవారికేదీ.. కిసాన్‌ సమ్మాన్‌?
లోగో

రెబ్బెన, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పంటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాకు రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తోంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో నమోదైన రైతులకే పథకం వర్తిస్తోంది. ఆ తర్వాత పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరడం లేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా భూమిని పొందిన వారు, ఇతరుల నుంచి భూమికొనుగోలు చేసిన కొత్త పట్టాలు పొందిన వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో కొత్త రైతులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పథకంలో చేర్చడం లేదు. 2019లో కేంద్ర ప్రభత్వుం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ ప్రారంభించగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు, వీదేశాల్లో నివాసం ఉండే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది.

- ఐదెకరాల లోపు..

ప్రారంభంలో భూ పరిమితిని విధించి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా రూ.6వేల సాయాన్ని మూడు విడతల్లో అందించారు. ఏడాది గడిచాక భూ పరిమితి తొలగించి ఎన్ని ఎకరాలున్నా ఒక్కొ రైతుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేసింది. పాత రైతులకే తప్ప కొత్త వారికి ఈ పథకంలో అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా వేలాది మంది కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి దూరమవుతున్నారు. కొత్త వారికి అవకాశం లేక పోవడంతో క్రమంగా అర్హుల సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర పరిశీనతో మరణించిన రైతుల పేర్లు తొలగింపు, భూముల అమ్మకాలు, కుటుంబ సభ్యుల పేరిట భూములను విరాసత్‌ చేయటంతో రైతుల సంఖ్య తగ్గింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఈ పథకం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరడం, ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు ఇలా కేంద్రప్రభుత్వ పరిశీలనలో వివరాలు బహిర్గతం కావడంతో వారికి పథకం నిలిపివేసింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో జిల్లాలో 1,42,155 మంది రైతులున్నారు. పథకంలో ప్రారంభంలో సుమారు 68వేల మంది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం అందింది. కానీ కొన్ని నెలల క్రితం కేంద్రం విడుదల చేసి 20వ విడత 33,369 మందికి మాత్రమే కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఆర్ధిక లబ్ధి చేకూరినట్లు చెబుతున్నారు. అర్హులు కూడా పెట్టుబడి కోసం అప్పులపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రబుత్వం కూడా రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు కొత్తగా పట్టాపాస్‌ పుస్తకాలు పొందిన రైతుల వివరాల నమోదుకు నిర్ధిష్టమైన తేదీని నిర్ణయించాయి. అప్పటి వరకు పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేస్తున్నారు. కానీ కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రైతును కూడా కిసాన్‌ సమ్మాన్‌లో చేర్చలేదు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని దరఖాస్తులు చేసుకున్న రైతులు కోరుతున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:27 PM