Patient Monitoring: రోగికి బయోసెన్సార్తో వైద్యుడికి అలర్ట్లు
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:31 AM
ఆస్పత్రి వార్డులో ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా బయోసెన్సార్ సాంకేతికతను కిమ్స్ ఆస్పత్రిలో....
కిమ్స్లో ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ
కిమ్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్రావు వెల్లడి
హైదరాబాద్ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి వార్డులో ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా బయోసెన్సార్ సాంకేతికతను కిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎండీ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. ఇప్పటికే ఐసీయూలో ఉన్న రోగికి సంబంధించిన సమాచారం ఈ విధానంలో నిరంతరం అందుతోందని, ఇక నుంచి వార్డుల్లో ఉండే రోగులకు కూడా ఈ సదుపాయం తీసుకొచ్చామని చెప్పారు. మంగళవారం కిమ్స్లో ఈ ‘ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక’ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ విధానంలో వార్డులో ఉన్న రోగికి బయోసెన్సార్ను అమరుస్తారని, ఇందుకు వైర్లెస్ వేరబుల్ పరికరాలను ఉపయోగిస్తారని తెలిపారు. దీని ద్వారా రోగి గుండె స్పందనలు, శ్వాస, టెంపరేచర్, పల్స్ రేట్, బీపీ వంటి కీలక పారామీటర్లను వైద్యులు నిరంతరం రిమోట్గా పర్యవేక్షించేందుకు వీలుంటుందని, వారి మొబైల్కు ఈ వివరాలు చేరతాయని చెప్పారు. రోగుల పరిస్థితిలో ఏమైనా మార్పులుంటేరియల్ టైంలో వైద్యులకు, క్లినికల్ బృందాలకు అలర్ట్ సమాచారం అందుతుందన్నారు. తద్వారా పూర్తి సమన్వయంతో తగిన చికిత్స అందిస్తారని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ముందంజలో ఉంటుందని, వీటిలో ఆగ్మెంట్ రియాలిటీ అసిస్టెడ్ న్యూరో సర్జరీ, అత్యాధునిక ఇమేజింగ్ సిస్టమ్లు, ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్స్ ఉన్నాయన్నారు.