Bolla Anilkumar: రూ.240 కోట్ల లాటరీ విజేతది ఖమ్మం జిల్లానే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:59 AM
యూఏఈలో ఇటీవల నిర్వహించిన లాటరీలో రూ.240కోట్లు గెలుచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి బోల్లా అనిల్కుమార్ ఖమ్మం జిల్లా యువకుడేనని తెలిసింది...
వేంసూరు మండల యువకుడిని వరించిన అదృష్టం
వేంసూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): యూఏఈలో ఇటీవల నిర్వహించిన లాటరీలో రూ.240కోట్లు గెలుచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి బోల్లా అనిల్కుమార్ ఖమ్మం జిల్లా యువకుడేనని తెలిసింది. జిల్లాలోని వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన సాధారణ రైతు దంపతులు మాధవరావు, భూలక్ష్మిల కుమారుడైన అనిల్ బొల్లా.. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. హైదరాబాద్లో ఉన్నతవిద్య పూర్తి చేసి తొలుత నగరంలో.. తరువాత చెన్నైలో ఉద్యోగం చేశారు. యూఏఈలో ఉద్యోగ అవకాశం రావడంతో ఏడాదిన్నర క్రితం అక్కడకు వెళ్లారు. కొంత కాలంగా పలు లాటరీల్లో పాల్గొంటున్న ఆయన.. ఇటీవల కొనుగోలు చేసిన పది టికెట్లలో, తన తల్లి పుట్టినరోజుతో కూడిన నెంబరుకు జాక్పాట్ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు.