KCR to Meet BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఇన్చార్జులతో నేడు కేసీఆర్ భేటీ
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:57 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు.. బీఆర్ఎస్ ఇన్చార్జులతో..
ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్
అధినేతతో భేటీ అయిన కేటీఆర్, హరీశ్
హైదరాబాద్/గజ్వేల్/మర్కుక్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు.. బీఆర్ఎస్ ఇన్చార్జులతో.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు గురువారం భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డివిజన్లవారిగా పార్టీ నియమించిన ఇన్చార్జులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ కూడా కావడంతో.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ఆయన నేరుగా పాల్గొంటారని సమాచారం. అందులో భాగంగానే ఇన్చార్జులతో ముందస్తు సమావేశం నిర్వహించి.. కార్యాచరణ ప్రకటిస్తారని తెలిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ప్రచార వ్యూహం, రోడ్షోలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం.. ఇతర అంశాలపై గులాబీ బాస్ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్లో విజయంపై కేసీఆర్ ధీమా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం బీఆర్ఎ్సదేనని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులతో కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ పరిధిలో తాజా పరిస్థితులు, పార్టీ ప్రచార కార్యక్రమాలపై వారు కేసీఆర్కు వివరించారని సమాచారం. ఈ మేరకు రంగంలోకి దిగాల్సిందిగా కేసీఆర్ను కోరినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎ్సతోనే ఉన్నారని, నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించినట్లు సమాచారం.