BRS chief and former Telangana CM K. Chandrashekar Rao: ఊరూరా ఉద్యమిద్దాం!
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:57 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు...
‘పాలమూరు-రంగారెడ్డి’పై ప్రజల్లోకెళ్దాం
తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎ్సపైనే ఉంది: కేసీఆర్
మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నేతలతో సమావేశం
పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ
మూడు జిల్లాల్లో నిర్వహించే సభలపై చర్చ
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు..వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం
మర్కుక్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌ్సలో మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావుతోపాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్రెడ్డి, శ్రీనివా్సగౌడ్, లక్ష్మారెడ్డి, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపైనే విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీ పట్టించుకోవడంలేదని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందన్నారు. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామని, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మూడు జిల్లాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల గురించి ప్రస్తావించారు. అందుకు ముందుగా గ్రామగ్రామాన పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అంతేకాకుండా పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మూడు జిల్లాల్లో బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలి, ఏయే తేదీల్లో నిర్వహిస్తే ప్రజల్లోకి బలమైన సందేశం వెళుతుందనే అంశంపై ఆయా జిల్లాల మాజీ మంత్రులు, నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తాలని కేసీఆర్ అన్నారు. సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం, మొత్తంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణకు ఈ సమావేశం కీలక మైలురాయిగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బీఆర్ఎ్సలో చేరిన కాంగ్రెస్ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఉప సర్పంచ్, ఆరుగురు వార్డు సభ్యులు బీఆర్ఎ్సలో చేరారు. శుక్రవారం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, వెెంకటేశ్వరతండా సర్పంచ్ సేవ్యా నాయక్ల ఆధ్వర్యంలో రెండు బస్సుల్లో 150 మంది గ్రామస్థులు ఎర్రవల్లిలోని ఫాంహౌ్సకు వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. అనంతరం కాంగ్రెస్ ఉపసర్పంచ్ థావుర్యా, వార్డు సభ్యులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎ్సలో చేరారు.