Kavitha visited Tirumala: జాగృతి జనం బాట సక్సెస్ కావాలి స్వామీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:33 AM
జాగృతి జనం బాట’ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని వేడుకున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ...
తిరుమల వెంకన్నను వేడుకున్న కల్వకుంట్ల కవిత
హైదరాబాద్/తిరుమల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని వేడుకున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. శ్రీవారిని ఆమె ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 25 నుంచి నాలుగు నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వామి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. కాగా, దర్శనం అనంతరం కవిత శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న హథీరాంజీ మఠానికి వెళ్లారు. హథీరాంజీ బర్ఫి ఉత్సవం సందర్భంగా మఠంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మఠాన్ని తొలగించి దుకాణ సముదాయాన్ని నిర్మించే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా తిరుమలకు దర్శనానికివచ్చే బంజారా బిడ్డలకు వసతి, సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రసంగం చివరిలో కవిత నోట జై తెలంగాణతో పాటు జై ఆంధ్రా అనే నినాదం వినిపించడం విశేషం.
జాగృతి ఐటీ విభాగం కార్యవర్గం ఏర్పాటు
తెలంగాణ జాగృతి ఐటీ విభాగం నూతన కార్యవర్గాన్ని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇందులో జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా గుండెబోయిన శశిధర్ను గతంలోనే నిర్ణయించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, మహిళా ప్రతినిధులుగా.. పశుపతినాథ్, ఎల్కే. అశోక్ కుమార్, పద్మ, పి.శక్తిస్వరూ్పసాగర్, అన్నపూర్ణ తదితరులున్నారు.