Kalvakuntla Kavitha: కక్ష సాధింపు రాజకీయాలకు నేను మొదటి బాధితురాలిని..
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:39 AM
కక్ష సాధింపు రాజకీయాలకు మొదటి బాధితురాలిని నేను. ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలకు కేటీఆర్ బలవుతున్నారు. అయినా చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది...
ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది: కల్వకుంట్ల కవిత
మియాపూర్/రాజేంద్రనగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘కక్ష సాధింపు రాజకీయాలకు మొదటి బాధితురాలిని నేను. ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలకు కేటీఆర్ బలవుతున్నారు. అయినా చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పీఏ నగర్లో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతించిన విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స మాధానంగా ఆమె పైవిధంగా స్పందించారు. బీజేపీ వాళ్లకు వాళ్లమీద వీళ్లమీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని విమర్శించారు. ఆ 2 పార్టీలు ప్రజలకు మొఖం చూపలేక ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్నట్లు ఉందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్లో పర్యటించిన కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిపక్షం నిద్ర పోతోందని, పాలకపక్షం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరువును తీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. భూపాల్నగర్ కొండలపై పేదలు నిర్మించుకున్న ఇళ్లలోకి వెళ్లిన కవిత వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత చలసాని విష్ణుమూర్తి తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.