Kalvakuntla Kavitha: కృష్ణారావు అవినీతిని బయటపెడతా
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:46 AM
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు....
నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం
ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా: కవిత
బోయినపల్లి/యూసు్ఫగూడ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయటం ద్వారా కృష్ణారావు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ను బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో విలేకరుల సమావేశం పెట్టి, ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కూకట్పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే తాను ప్రస్తావించానని తెలిపారు. కృష్ణారావు మాటలకు తానేమీ బాధపడటం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి రామన్నకుంట చెరువు, బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. అనంతరం మనోవికాస్నగర్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ)ను సందర్శించి దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కృష్ణారావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పారు. త్వరలో ఆయన అవినీతి పనులను బయటపెడతానని ప్రకటించారు. ఇటు యూసు్ఫగూడలోనూ పర్యటించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణారావు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆడాల్సిన టెస్టులు ఇంకా ఉన్నాయి’ అని అన్నారు.