Journalists Unification Demanded: Sజర్నలిస్టులందరికీ ఒకే అక్రెడిటేషన్ ఇవ్వాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:29 AM
పోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డు, సబ్ ఎడిటర్లకు మీడియా కార్డు ఇస్తామని ప్రభుత్వం జర్నలిస్టులను విభజించడం సరికాదని హెచ్యూజే..
రిపోర్టర్, డెస్క్ జర్నలిస్ట్ అనే విభజన వద్దు
ప్రభుత్వానికి హెచ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల వినతి
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్/పంజాగుట్ట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డు, సబ్ ఎడిటర్లకు మీడియా కార్డు ఇస్తామని ప్రభుత్వం జర్నలిస్టులను విభజించడం సరికాదని హెచ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు అభిప్రాయపడ్డాయి. జీవో 252లో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని హెచ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం సమాచార శాఖ డైరెక్టర్ కిశోర్బాబు, అదనపు డైరెక్టర్ జగన్ను కలిసి జర్నలిస్టులు వినతిపత్రాలు అందజేశారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలో మాదిరిగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అడ్హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్యూజే కార్యదర్శి జగదీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, పలువురు డెస్క్ జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. కాగా, జర్నలిస్టుల కనీస హక్కు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా.. జర్నలిస్టుల మధ్య విభేదాలు తెచ్చే విధంగా జీవో 252 ఉందని టీయూడబ్ల్యూజే(హెచ్ 143)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ విమర్శించారు. జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ 27న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
డెస్క్ జర్నలిస్టులకూ బస్ పాస్లు ఇస్తాం..
డెస్క్ జర్నలిస్టులకు కూడా బస్ పాస్ సౌకర్యం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రసార మాధ్యమాల్లో డెస్క్ జర్నలిస్టులకు బస్పాస్ ఉండబోదని వచ్చిన వార్తలు సరికావని పేర్కొంది. అక్రెడిటేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవోలో డెస్క్ జర్నలిస్టులకు కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తామని పేర్కొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.