Minister Duddilla Sridhar Babu: సర్కారుపై కేటీఆర్ దుష్ప్రచారం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:06 AM
ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు...
రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం
‘ఫ్రీహోల్డ్ రైట్స్’కు వారే 3 జీవోలిచ్చారు
పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు
వారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించాం
జూబ్లీహిల్స్ ఓటమితో చుక్కలు: దుద్దిళ్ల
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు. పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ప్రభుత్వం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే.. దానిని 5 లక్షల కోట్ల కుంభకోణమంటూ కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై బీఆర్ఎస్ ప్రభుత్వమే యాజమాన్య హక్కులు కల్పించిందని, ఇందుకు సంబంధించి 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ‘ఫ్రీహోల్డ్ రైట్స్’ పేరిట మూడు జీవోలు జారీ చేసిందని తెలిపారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. ఆ జీవోల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించింది 4,740 ఎకరాలేనని, మిగిలిన భూమిని రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించామని తెలిపారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాలుగా ఇస్తూ వచ్చినవని వెల్లడించారు. అందులో భాగంగా అజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్పేటల్లోని పరిశ్రమల భూములకు ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇందుకు సంబంధించి ఇండస్ర్టీస్, కామర్స్ డిపార్టుమెంట్ 2023 ఆగస్టులో జీవో నెం.19, 20, 21లను జారీ చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ భూములకే తాము కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామని, 30 శాతం, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఓటమితో పగలే చుక్కలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమితో కేటీఆర్కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు. వారి పార్టీ ప్రసార సాధనాలు బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయన్నారు. ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఏదైనా కుంభకోణం జరిగి ఉంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగి ఉండాలని వ్యాఖ్యానించారు. పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలంటూ జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలని అన్నారు. వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే తాము కల్పించామని వెల్లడించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపి 30 శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించారని తెలిపారు. కన్వర్షన్ ఇంపాక్ట్ చార్జీల ద్వారా ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామన్నారు. అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే అని చెప్పారు. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్కు దరఖాస్తు చేసుకోలేరని పేర్కొన్నారు.
సీఎం సోదరులపై అభూత కల్పనలు..
సీఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారంటూ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు తప్పుబట్టారు. వారెవరూ ప్రభుత్వంలో లేరని, పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుందని తెలిపారు. కేటీఆర్ ఆలోచనల్లో ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి వెళ్లిపోతే.. తాము రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని ిసీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. దానికి ఎలా గండికొట్టాలా అని చూడటమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ప్రతిపక్షంగా సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ.. అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు, బెదిరింపు ధోరణులు మానుకోవాలని హితవు పలికారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని అన్నారు. పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ర్టాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారని తెలిపారు. మన దగ్గర భూముల విలువ ఎక్కువ, లభ్యత కూడా తక్కువ అని, అయినా పరిశ్రమలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్థి చెందుతుందని అన్నారు.