Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:29 AM
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల సందేహాలు, సమస్యల పరిష్కారం కోసం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కాల్...
లబ్ధిదారుల ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నెంబర్ 1800 599 5991
ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల సందేహాలు, సమస్యల పరిష్కారం కోసం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 1800 599 5991 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కాల్సెంటర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కాల్ సెంటర్కు వచ్చిన ఫోన్ చేసిన వారితో మాట్లాడారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్కు చెందిన లబ్ధిదారు తన ఇల్లు పునాది వరకు పూర్తయినా బిల్లు రాలేదని తెలపగా వివరాలు పరిశీలించి.. వచ్చే సోమవారం నాటికి రూ.లక్ష ఖాతాలో జమవుతాయని చెప్పారు. మరో వ్యక్తి ఫోన్ చేసి హైదరాబాద్లో ఇళ్లు ఎప్పుడు ఇస్తారని అడగ్గా.. నివాస స్థలాల కొరత వల్ల ఆలస్యమైందని, త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఇళ్లు అందిస్తామని మంత్రి సమాధానమిచ్చారు. ఫోన్ కాల్స్ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.