Share News

kumaram bheem asifabad- అ‘సమగ్ర’ కొలువులు

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:25 PM

ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్‌ ఇస్తామని ప్రకటించి క్షీరాభిషేకాలు చేయించుకుని మోసం చేసిందని విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం గత డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 7 వరకు సమ్మె కొనసాగించారు.

kumaram bheem asifabad- అ‘సమగ్ర’ కొలువులు
డిమాండ్లు పరిష్కరించాలని దీక్ష చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు(పైల్‌)

- సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలు

- చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకు అవస్థలు

- ప్రభుత్యం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్‌ ఇస్తామని ప్రకటించి క్షీరాభిషేకాలు చేయించుకుని మోసం చేసిందని విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం గత డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 7 వరకు సమ్మె కొనసాగించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలుకావడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్‌లైన్‌లో విద్యార్థుల నమోదు, బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీవీల నిర్వాహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అకౌంటెంట్లు, ఏఎన్‌ఎంలు, కంప్యూటర్‌ ఇన్స్‌స్ట్రక్టర్లు, మండల స్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీలు, వ్యాయమ వొకేషనల్‌ ఉపాధ్యాయులు, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లు, డే, నైట్‌ వాచ్‌మెన్‌లు, స్వీపర్లు, స్కావేంజర్లు, జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం ఎనలిస్టులు, టెక్నికల్‌ పర్సన్‌లు, డీఎల్‌ఎంటీ మెస్సేంజర్లు, మోడల్‌ స్కూళ్లలో పనిచేసే వార్డెన్‌లు, ఆపరేటర్లు, కేర్‌ టేకర్లు కూడా సమగ్ర శిక్ష పరిధిలోకే వస్తారు.

- జిల్లాలో 440 మంది..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లావ్యాప్తంగా 440 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 347 మంది, సీఆర్పీలు 54, సీసీవోలు 10 మంది, ఎంఐఎస్‌సీవోలు 11, ఐఈఆర్పీలు 18 మంది పనిచేస్తున్నారు. కలెక్టర్‌ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూ డైస్‌, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాప్ట్‌, ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు.

- సమ్మె విరమణ సమయంలో..

సమ్మె విరమణ సమయంలో పే స్కేల్‌ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉప సంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీ చేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంత వరకు ఒక్కటి కూడా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం 15 సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించుకోలేదు. డిమాండ్ల సాధనకు గత డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు సమ్మె చేశారు.

- అరకొర వేతనాలతో...

సమగ్ర శిక్ష ఉద్యోగులు, సిబ్బంది చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు పెరగక వచ్చే వేతనంతో కుటుంబం పోషించుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్టు టైం ఉద్యోగులను ఫుల్‌ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారిదిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రూపాయల రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల పరిహారం చెల్లించి ప్రతీ ఉద్యోగికి 10 లక్షల రూపాయల జీవిత బీమా, ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ హామీలు నిలబెట్టుకోవాలి...

- గెడేకార్‌ సంతోష్‌, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధికార ప్రతినిధి,

సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిల బెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. పేస్కేల్‌ అమలు కోసం మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం వెంటనే ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - Nov 23 , 2025 | 10:25 PM