Hydra: 38 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:46 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో 38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా కాపాడి..
పేట్బషీరాబాద్లోని భూమి చుట్టూ ఫెన్సింగ్
ఇది 2008లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలం
పేట్బషీరాబాద్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో 38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఈ భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు మ్యుచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. అయితే దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంచింది. ఇదిలా ఉండగా ఈ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నాయని సొసైటీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఆ విభాగంతో పాటు రెవెన్యూ, మునిసిపల్, హెచ్ఎండీఏ అధికారులు కలిసి పరిశీలించారు. అక్కడ ఆక్రమణలు జరిగినట్లు, ఇప్పటికే కొంతమంది ఇళ్లు కట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. ఇళ్ల జోలికి వెళ్లకుండా, ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. దీనిపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా కోర్టు తీర్పు ప్రకారం స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈలోగా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా స్పష్టం చేసింది. ఆ స్థలంలో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని రంగనాథ్ తెలిపారు.