Musi River: మూసీ చుట్టూ 3 కార్పొరేషన్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:17 AM
హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకొని రాజధాని నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్
ఒక్కో కార్పొరేషన్లో వందేసి వార్డులు
మూడింటికి ముగ్గురు మేయర్లు
ప్రతీ కార్పొరేషన్లో 20 సర్కిళ్లు, 5 జోన్లు
కమిషనర్గా కార్యదర్శి స్థాయి అధికారి
జనవరిలో తుది నోటిఫికేషన్
ఏప్రిల్-మేలో ఎన్నికల నిర్వహణకు సన్నాహం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకొని రాజధాని నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్ పేర్లతో మొత్తం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ కీలకం కాబట్టి మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ మూసీకి ఇరువైపుల ప్రాంతాలు ఉంటాయి. ఒక్కో కార్పోరేషన్ పరిధిలో 100 వార్డులు ఉంటాయి. ప్రతి కార్పొరేషన్లో 20 సర్కిళ్లు, 5 జోన్లు, ప్రతి జోన్కు నాలుగు సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పాతనగరం, సెంట్రల్ హైదరాబాద్ ఉంటాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎ్సఎంసీ) పరిధిలో ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ)కి సంబంధించి పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు కలుస్తాయి.