డ్రైనేజీ పైపునకు రంధ్రం
ABN , Publish Date - May 03 , 2025 | 11:09 PM
మండలంలోని చెర్వుగట్టులో పార్వతీమాత ఆలయం వద్దకు వెళ్లే మూల మలుపు వద్ద డ్రైనేజీ పైపు పగిలి ప్రమాదం పొంచి ఉంది.
డ్రైనేజీ పైపునకు రంధ్రం
ఆదమరిస్తే తప్పదు గాయం..!
చెర్వుగట్టులో పార్వతీ అమ్మవారి ఆలయం మలుపు వద్ద పగిలిన డ్రైనేజీ పైప్
రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
నార్కట్పల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చెర్వుగట్టులో పార్వతీమాత ఆలయం వద్దకు వెళ్లే మూల మలుపు వద్ద డ్రైనేజీ పైపు పగిలి ప్రమాదం పొంచి ఉంది. సరిగ్గా మూలమలుపు వద్దే పగిలిన ఈ డ్రైనేజీ పైప్ పై నుంచి వెళ్లే వాహనాలు కుదుపునకు గురవుతున్నాయి. గ్రామస్థులు కాకుండా చెర్వుగట్టు క్షేత్రానికి సందర్శనకు వచ్చే ద్విచక్ర వాహనదారులు అకస్మాత్తుగా పగిలిన డ్రైనేజీ పైప్పై వెళ్లి కిందపడి గాయాలపాలవుతున్నారు. జనవరి నెలలో జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో కూడా డ్రైనేజీ పైప్లైను ధ్వంసమై ప్రమాదకరంగా మారడంతో పత్రికల్లో వచ్చేంత వరకు పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. పైగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. జాతర తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారంగా పగిలిన పైప్ స్థానంలో కొత్త పైప్ వేస్తామన్నారు. జాతర పూర్తయి దాదాపు 4 నెలలు గడుస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో డ్రైనేజీ పైప్ పై మళ్లీ రంధ్రం ఏర్పడి ప్రమాదం పొంచి ఉంది. గ్రామస్థులకు తెలియడంతో ఈ మూల మలుపు వద్దకు వచ్చేసరికి జాగ్రత్త పడుతున్నారు. కానీ కొత్తగా వచ్చే భక్తులకు ఇది తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని బాధితులు కోరుతున్నారు.