Singur Project: సింగూరు కాలువల టెండర్లు రద్దు!
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:01 AM
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు చెందిన కాలువల కోసం ఈపీసీ (ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో పిలిచిన టెండ ర్లను రద్దు చేయడానికి హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు చెందిన కాలువల కోసం ఈపీసీ (ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో పిలిచిన టెండ ర్లను రద్దు చేయడానికి హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. శనివారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా ఆధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. సింగూరు ప్రాజెక్టుకు చెందిన ఎడమ కాలువ 0.00 కి.మీ. నుంచి 48 కి.మీ. దాకా పనులతో పాటు కుడికాలువ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, క్షేత్రస్థాయి కాలువల పనులను ఈపీసీ ప్రాతిపదికన 24 మాసాల్లో పూర్తి చేసేందుకు గాను 2006లో మహాలక్ష్మి ఇన్ఫ్రాకు కట్టబెట్టారు.
అయితే, పనులు దక్కించుకున్నా నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేకపోవడంతో టెండర్లు రద్దు చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఏజెన్సీ కూడా అంగీకరించడంతో పెండింగ్లో ఉన్న రూ.2.63 కోట్ల బిల్లుల చెల్లింపులు, ఆడిట్ పేరాలు పరిశీలించి, టెండర్ను రద్దు చేయాలని హైపవర్ కమిటీ అధికారులను ఆదేశించింది.