Share News

అనుమానంతో అంతమొందించాడు

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:28 AM

: సూర్యాపేట జిల్లా గరిడే పల్లిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన మహిళా కేసును పోలీసులు ఛేదించారు.

అనుమానంతో అంతమొందించాడు
కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చరమందరాజు

ప్రియురాలిని గొంతు నులిమి చంపిన వైనం

గరిడేపల్లి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హుజూర్‌నగర్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా గరిడే పల్లిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన మహిళా కేసును పోలీసులు ఛేదించారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు కేసు వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం గానుగబండకు చెందిన షేక్‌. సైదాహుస్సేన్‌, సైదాబీ భార్యభర్తలు, కాగా వారికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన పాలేల్లి హుస్సేన్‌తో సైదాబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. సైదాభీ గ్రామస్థులతో కలిసి బచ్చన్నపేట గ్రామానికి వరినాట్లు వేసేందుకు వెళ్లేది. ఆమెతో పాటు పాలేల్లి హుస్సేన్‌ కూడా వెళ్లేవాడు. దీంతో సైదాభితో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. పాలేల్లి హుస్సేన్‌, సైదాభీ గానుగబండ గ్రామంలోని పోకల వెంకటేశ్వర్లుకు చెందిన పాకలో కలిసేవారు. ఇటీవల సైదాబీ వేరే వ్యక్తులతో మాట్లాడుతోందని ప్రియుడు అనుమానం పెంచుకున్నాడు. పదే పదే ఫోన్లు చేసి రమ్మని వేధించేవాడు. ఎలాగైనా సైదాభీని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడూ కలుసుకునే ప్రదేశానికి రావాలని హుస్సేన్‌ ఈ నెల 19న మద్యం సేవించి బైక్‌పై పాక వద్దకు వెళ్ళాడు. కాగా సైదాభి, హుస్సేన్‌ మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సైదాబీని హుస్సేన్‌ గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం తన గ్రామానికి చెందిన సైదమ్మకు చెప్పి పారిపోయాడు. ఆ విషయం ఎవరికీ తెలియనందున తన భార్య మృతికి అదే గ్రామానికి చెందిన పాలేల్లి హుస్సేన్‌పై అనుమానం ఉందని సైదాబీ భర్త సైదాహుస్సేన్‌ ఈనెల 20న గరిడేపల్లి పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారించారు. దీంతో పాల్లేలి హుస్సేన్‌ను పట్టుకొని విచారించి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. నిందుతుడి సెల్‌ఫోన్‌, సైదాబీ సెల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ చలికంటి నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 12:28 AM