Share News

Father Demise: హరీశ్‌రావుకు పితృ వియోగం

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:25 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంట విషాదం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్‌ బావ, హరీశ్‌ రావు తండ్రి అయిన తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం కన్నుమూశారు.

Father Demise: హరీశ్‌రావుకు పితృ వియోగం

  • ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూత

  • కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ఓదార్పు

  • సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, సంజయ్‌, ఏపీ సీఎం చంద్రబాబు సహా రాజకీయ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, సిద్దిపేట కల్చరల్‌, నార్సింగ్‌/రాయదుర్గం, అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంట విషాదం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్‌ బావ, హరీశ్‌ రావు తండ్రి అయిన తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని కోకాపేటలోని క్రిన్స్‌ విల్లా్‌సలో ఉన్న హరీశ్‌రావు నివాసంలో కుటుంబసభ్యులు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ రావు మృతికి సంతాపం తెలిపారు. తన్నీరు సత్యనారాయణరావు కేసీఆర్‌ అక్క, ఏడో సోదరి అయిన లక్ష్మి భర్త. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే కేసీఆర్‌ హరీశ్‌రావు నివాసానికి చేరుకొని సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. సోదరి లక్ష్మి, మేనల్లుడు హరీశ్‌ను ఓదార్చారు. అలాగే, హరీశ్‌ నివాసానికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సాయంత్రం వరకు అక్కడే ఉండి కార్యక్రమాల ఏర్పాట్లు చూసుకున్నారు. ఇక, ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాష్ట్ర మం త్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కౌశిక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సత్యనారాయణరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఏపీ మాజీ సీఎం జగన్‌ తదితరులు ప్రకటనల ద్వారా హరీశ్‌రావుకు తమ సానుభూతి తెలియజేశారు. సత్యనారాయణరావు మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఓ ప్ర కటన విడుదల చేశారు. ఇక, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమాలను సత్యనారాయణరావు మర ణం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రద్దు చేసుకుంది.

Updated Date - Oct 29 , 2025 | 05:28 AM