Harish Rao: ఎన్నికల కోసమే చీరలు, రుణాల పంపిణీ
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:36 AM
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల స్టంట్లో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు చీరలు...
మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వరా?: హరీశ్రావు
సిద్దిపేట/జమ్మికుంట రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల స్టంట్లో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు చీరలు, వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘం సభ్యులకు వడ్డీలేని రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కె.హైమావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకి 18 ఏళ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరలను అందించారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న సుమారు 46 లక్షల మందికి మాత్రమే చీరలను అందిస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు సీఎం రేవంత్రెడ్డి ఇస్తామన్న నెలకు రూ. 2,500 సంగతి ఏమైందని, రెండేళ్ల నుంచి మహిళలకు బకాయి పడ్డ రూ. 60 వేలు ఇచ్చి సారె పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు చీరలు ఇస్తామని చెప్పి ఒకటే చీర ఇస్తున్నారని, కాంగ్రె్సకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకంటే ప్రమాదకరంగా మారారని హరీశ్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ఇటీవల కూలిపోయిన చెక్డ్యామ్ను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు కూడా సాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోరన్నారు. గతంలో లక్ష క్యూసెక్కుల నీరు వచ్చినా చెక్కు చెదరని చెక్డ్యామ్ ఇప్పుడు ఎందుకు కూలిందో చెప్పాలని డిమాండ్ చేశారు.