Chief Minister Revanth Reddy: 18న గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:01 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చేతుల మీదుగా..
సీఎం రేవంత్ స్వయంగా అందిస్తారు: సీఎస్
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రూప్-2 కింద మొత్తం 783 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వీరికి సీఎం నియామక పత్రాలను అందజేస్తారని సీఎస్ తెలిపారు. వీరిలో 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటల లోపు శిల్పకళా వేదికలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్సరాజ్, డీజీపీ శివధర్రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.