Telangana Jagruthi president Kalvakuntla Kavitha: రైతు సమస్యలను పట్టించుకోని సర్కార్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:52 AM
రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు..
4 నెలల తర్వాత పార్టీ ఏర్పాటుపై నిర్ణయం
8 వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ: కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చి ఉంటే రైతుల సమస్యలన్నీ తీరేవని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జాగృతిని మరింత బలోపేతం చేసి సమస్యలను పరిష్కరించేలా పోరాటం చేస్తామని చెప్పారు. జాగృతి జనంబాట కార్యక్రమం ద్వారా నాలుగు మాసాల పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ తర్వాత పార్టీ పెట్టాలా.. లేదా ? అనేది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆదిలాబాద్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచే ఎమ్యెల్యేగా పోటీ చేయాలని అనిపిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రైతులెవరూ సంతోషంగా లేరని, వరికి బోనస్ ఇవ్వడం లేదని, రైతుభరోసా ఇస్తామన్నంత ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.