Former Chief Justice of India N.V. Ramana: నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:24 AM
మీ అందరికీ తెలుసు.. నా కుటుంబాన్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నారో.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు....
న్యాయమూర్తుల కుటుంబాలపైనా రాజకీయ కుట్రలు
అధికారం మారినప్పుడల్లా విధానాలు మార్చరాదు
వీఐటీ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ
తుళ్లూరు/తాడికొండ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ అందరికీ తెలుసు.. నా కుటుంబాన్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నారో.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించారు. రాజ్యాంగ సూత్రాలను సమర్థించిన న్యాయవ్యవస్థ సభ్యులు బదిలీలు, ఒత్తిడిని ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల కుటుంబాలు రాజకీయ కుట్రలకు లక్ష్యంగా మారాయి. దక్షిణ భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటం. అధికారం మారినప్పుడల్లా విఽధానాలకు అంతరాయం కలిగించడం తప్పు. అది అభివృద్ధిని కుంగదీస్తుంది. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది’’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం రాజధాని అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఐదేళ్లు పోరాడి వివిధ సవాళ్లను ఎదుర్కొని ఇక్కడ సంస్థను నిలబెట్టిన వీఐటీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను.’’ అని అన్నారు. ‘‘రాజకీయాల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ యువత చురుగ్గా పాల్గొనాలి. లేకపోతే దేశాన్ని నిజాయతీ లేని, స్వార్థపరులైన పాలకులు పాలిస్తారు. యువత కొత్త సందేశాలు, ఈ-మెయిల్లు, వార్తలు, నోటిఫికేషన్లు, లైక్ల కోసం ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్లు చూసుకోవడానికి పరిమితమవుతున్నారు. సోషల్ మీడియాకు బానిసలైన వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్ర్కీన్లను మితంగా ఉపయోగించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. అనంతరం పీహెచ్డీ, పీజీ, డిగ్రీలు, గోల్డ్మెడల్స్ సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వీఐటీ వ్యవస్థాపకుడు-చాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్, బెంగళూరు శ్యామ్సంగ్ ఎలక్ర్టానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్వర్మ, వీఐటీ వైస్ ప్రెసిడెంట్లు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ జీవీసెల్వం, వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్వీకోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్చంద్ర ముదిగంటి పాల్గొన్నారు.